YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం సీటు కోసం ముగ్గురు పోటీ

సీఎం సీటు కోసం ముగ్గురు పోటీ

తిరుపతి, ఏప్రిల్ 12, 
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అలాగే ప్రత్యర్థి వర్గాలపై నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. గత కొన్నాళ్లు సీఎం జగన్‌పై ఎడతెరిపి లేకుండా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి కుర్చీ పోతుందనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి ఎన్నికల సభను రద్దు చేసుకున్నారని చింతా మోహన్‌ ఆరోపించారు. సీఎం సీటు కోసం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్ద నాయకుడు, వెంకటగరి నుంచి మరో నేత, విజయనగరం నుంచి ఇంకో నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని బాంబు పేల్చారు. సీఎం కుర్చీ కోసం వైసీపీలో ఇప్పటికే రహస్య మంతనాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసే జగన్‌ తిరుపతిలో తన సభను రద్దు చేసుకున్నాడని ఆరోపించారు.ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించేలా అధిష్టానాన్ని ఒప్పిస్తానని చింతా మోహన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇప్పుడు దళితులు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం బెల్ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులను తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు.ఇక, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, విభజన గాయాన్ని చూపించి కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ సంబరపడుతున్నాయని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి త్వరలోనే సమాధానం లభిస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి ఎక్కువైందని, కాంగ్రెస్‌తోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.

Related Posts