అమరావతి ఏప్రిల్ 13, గుడ్డి కన్ను మూసినా ఒకటే... తెరచినా ఒకటే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసిరెడ్డి
తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి గెలిస్తే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, టీడీపీ అభ్యర్ధి గెలిస్తే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడ్డి కన్ను మూసినా ఒకటే... తెరచినా ఒకటేనన్నారు. పై రెండు పార్టీలు గుడ్డి కన్నుతో సమానమని ఎద్దేవా చేశారు. ఎవరు గెలిస్తే ఏమిటి? ఎవరు ఓడితే ఏమిటి?.. రాష్ట్రానికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. పై రెండు పార్టీలకు ప్రత్యేక హోదా తెచ్చే శక్తి ఉందా? అని నిలదీశారు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మించే శక్తి ఉందా?.. మన్నవరం ప్లాంటును పునరుద్ధరించే శక్తి ఉందా? అని అన్నారు. బిజేపీ చేతిలో వైసీపీ, టీడీపీలు కీలుబొమ్మలని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, టిడీపీలను ఓడించి కాంగ్రెస్ను గెలిపిస్తేనే రాష్ట్రానికి ప్రయోజనమని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు.