YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి

నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి

విజయవాడ, ఏప్రిల్ 14, 
వైసీపీలో ఇటీవ‌ల కాలంలో చాలా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌ర‌కు.. అన్ని జిల్లాల్లోనూ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి పెల్లుబికుతోంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు .. పార్టీ త‌ర‌ఫున టికెట్లు ఆశించిన కొంద‌రికి వాటిని ఇవ్వకుండా .. కొత్తగా వ‌చ్చిన వారికి ఇచ్చారు జ‌గ‌న్‌. దీంతో ఇలా టికెట్లు త్యాగం చేసిన వారికి.. ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని లేదా కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా.. ఇలాంటి ప‌ద‌వులు ఇవ్వలేదు. పైగా.. కొత్తవారికి ఇస్తున్నారు.నిన్నగాక మొన్న వైసీపీ తీర్థం పుచ్చుకున్నవారికి జ‌గ‌న్ ప‌ద‌వులు పందేరం చేస్తున్నారు. పార్టీ జెండా మోసి.. పార్టీ అధికారంలోకి రావాల‌ని త‌పించిన వారికి మాత్రం ఇప్పటి వ‌ర‌కు గుర్తింపు లేదు. పైగా జ‌గ‌న్ ఇలాంటి వారికి క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ నేత‌లు అంతా ర‌గిలిపోతున్నార‌నే చెప్పాలి. పైగా మంత్రులు, ఎంపీల ఆధిప‌త్యంతో వీరి ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతోంది. ఇక‌, ఇటీవ‌ల జరిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప‌ద‌వులు ఇస్తామ‌ని చెప్పి.. ఇవ్వనివారు కూడా ర‌గిలిపోతున్నారు. అయితే.. పైకి ఏమీ అన‌లేక పోతున్నారు. అలాగ‌ని లోలోన స‌ర్దుబాటు కూడా చేసుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారు ఆల్ట‌ర్నేట్ కోసం ఎదురు చూస్తున్నారు.ఏదైనా బ‌ల‌మైన పార్టీ క‌నుక ఉండి ఉంటే.. ఇప్పటి వ‌ర‌కు ఉంటామా ? అని ఇటీవ‌ల ఓ నేత అన్నట్టుగా తూర్పులో ప్రచారం జ‌ర‌గింది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు బ‌ల‌మైన పార్టీ అనేది ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఉన్న బ‌ల‌మైన పార్టీ టీడీపీ కూడా కూసాలు క‌దిలిపోయే ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఈ పార్టీలోనే నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పార్టీ ప‌రిస్థితి ఏమైనా మెరుగు ప‌డితే.. అప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ వైసీపీ నుంచి నాయ‌కులు వ‌ల‌స వ‌స్తార‌ని భావిస్తున్నారు.లేకపోతే.. వైసీపీలోనే త‌ప్పని ప‌రిస్థితిలో ఉండాల్సి ఉంటుంద‌ని కూడా వైసీపీ నేత‌లే చ‌ర్చించుకుంటు న్నారు. పోనీ.. జ‌న‌సేన ఏమైనా బ‌ల‌ప‌డుతుందా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో బీజేపీలోకి వెళ్లినా మ‌రింత న‌ష్టమే త‌ప్ప ఉప‌యోగం లేదు. స్థానికంగా రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాలంటే బీజేపీ అన‌వ‌స‌రం అన్న నిర్ణయానికి అంద‌రు వైసీపీ నేత‌లు వ‌చ్చేశారు. మొత్తంగా ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఆల్ట‌ర్నేట్ లేక‌పోవ‌డం.. వైసీపీలో అసంతృప్తుల‌కు పొలిటిక‌ల్ కెరీర్‌ను సందిగ్ధంగా మార్చేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts