తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అతిత్వరలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ప్రారంభించనున్న నేపథ్యంలో టిటిడి ఉద్యోగులకు, టిసిఎస్ సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఎస్ ఎస్ డీ టోకెన్లు జారీ చేశారు అదికారులు. తిరుమలలోని ఆర్టిసి బస్టాండులో గల కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబరులో ఆధార్ నంబరు ద్వారా వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం విజయవంతమైందన్నారు. ప్రస్తుతం న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టిసి బస్టాండులో గల కౌంటర్లలో కొన్ని రోజుల పాటు పరిమిత సంఖ్యలో భక్తులకు టోకెన్లు మంజూరుచేసి అప్లికేషన్ పనితీరును పరిశీలిస్తామన్నారు. రెండు రోజుల్లో టిటిడి ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం చేయనుందని, ఆ తరువాత సర్వదర్శనం కౌంటర్లను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని జేఈఓ తెలియజేశారు.