కోల్ కత్తా, ఏప్రిల్ 14,
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని రక్షించగలిగింది కేవలం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వారు తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సంఘ్ పరివార్ సభ్యులు గత ఆరు నెలల నుంచి ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కేవలం ఎన్నికలపైనే వర్క్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ లక్ష్యం బీజేపీని అక్కడ అధికారంలోకి తీసుకురావడమే. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన కార్యకర్తలను ఐదు రాష్ట్రాల్లో నియమించింది.ఆర్ఎస్ఎస్ కార్కకర్తలు నిబద్ధతతో పనిచేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకూ తమకు అప్పగించిన పనిపైనే దృష్టి పెడతారు. ఇతర విషయాల జోలికి వెళ్లరు. వారికి సమయానికి భోజన ఏర్పాట్లు చేస్తే చాలు. ఇంటింటికి తిరగడం, స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం వంటివి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తారు. పశ్చిమ బెంగాల్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏడాది నుంచి పనిచేస్తున్నారు.ఇక కేరళలో సయితం ఆర్ఎస్ఎస్ శాఖలు బలంగా ఉన్నాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఆర్ఎస్ఎస్ కు 4,500 శాఖలున్నాయి. వీటితో పాటు బయట వారిని కూడా ఎన్నికల కోసం నియమించారు. ఇటీవల కాలంలో మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కన్పిస్తుందని వివిధ రాష్ట్రాల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా అందిన నివేదికను బట్టి తెలుస్తుంది. బీజేపీ కూడా వీరి నివేదికలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.పెట్రోలు, గ్యాస్ ధరలు పెంపు, నిత్యవసరాల ధరలు పెరగడంతో ప్రజల్లో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తుందని, మోదీ మాటలను కూడా ప్రజలు విశ్వసించడం లేదని ఆర్ఎస్ఎస్ తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. అసోం మినహా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కడా లేవని కూడా వారు చెప్పినట్లు సమాచారం. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అప్రమత్తమయింది. మోదీ, అమిత్ షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.