నల్గొండ, ఏప్రిల్ 14,
సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయ్. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చేస్తూ ఎన్నికల్లో హీట్ పెంచుతున్నారు నేతలు. టీఆర్ఎస్,కాంగ్రెస్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండు పార్టీల నేతలు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కి ముందే చేరికలను ప్రోత్సహించింది టీఆర్ఎస్..కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాలున్న ఆ నేతలే ఇప్పుడు గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు.నాగార్జునసాగర్ ఉపఎన్నికల వ్యూహాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించి ఫీల్డ్లోకి పంపి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయిన తర్వాత వచ్చిన ఉపఎన్నిక నాగార్జునసాగర్. ఇది కూడా ఆ పార్టీకి సిట్టింగ్ స్థానమే. దీంతో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధం లేదు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి జానారెడ్డి బరిలో ఉండటం. ఇంకోవైపు బీజేపీ కాలుదువ్వుతుండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీఆర్ఎస్.జానారెడ్డికి ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో పట్టుఉంది. ప్రతిఊరిలోనూ ఆయనకు గట్టి అనుచర గణం ఉంది. అయితే 2018 ఎన్నికల తర్వాత.. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక చాలా మంది జానారెడ్డి అనుచరగణం కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయింది. ఇలా కారెక్కిన వారంతా చిత్తశుద్ధితో నోముల భగత్ గెలుపుకోసం పనిచేస్తున్నారా లేక కోవర్టులుగా పనిచేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. అనుమానంతో పార్టీలో ఉన్నవారిని కోవర్టులుగా ముద్ర వేస్తే అది అసలుకే మోసం వస్తుంది. అందుకే పార్టీలో ఇటీవల చేరిన వారు ఎవరు..వారిలో జానారెడ్డి అనుయాయులు ఎవరు అన్నది రహస్యంగా తెలుసుకుంటున్నారట.కోవర్టులుగా భావిస్తున్న వారు ఎవరిని కలుస్తున్నారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు వారి కదలికలేంటి అన్న అంశాలను తెలుసుకోవడానికి టీఆర్ఎస్ ఓ టీమ్ను సిద్ధం చేసింది. పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులతో కోవర్టులు జతకలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా అసంతృప్తులు, కోవర్టులు ఎవరన్నదానిపై ఒక జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ టీమ్లో హైదరాబాద్ నుంచి సూచించిన వారే సభ్యులుగా ఉన్నారట. జిల్లా, స్థానిక టీఆర్ఎస్ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని టాక్. అయితే ఈ విషయం తెలిసిన స్థానిక నేతలు ఎన్నికలను లైట్ తీసుకోకుండా సీరియస్ గా పని చేస్తున్నారట.
పోల్ మేనేజ్ మెంట్ పై గులాబీ దృష్టి
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతోంది. సాగర్ సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై అధికార టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న కాంగ్రెస్కు పట్టు ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో పై చేయి సాధించే పనిలో పడింది. పోలింగ్ బూత్ల వారీగా సమాచారం సేకరిస్తోంది. తమకు అనుకూల వాతావరణం సృష్టించుకునే పనిలో పడింది టిఆర్ఎస్.నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ప్రచార గడువు దగ్గర పడుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న అధికార టిఆర్ఎస్..సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నప్పటికి పోల్ మెన్మేంట్ సక్సెస్ ఫుల్గా చేస్తే గెలుపు తథ్యం అనే ధీమాతో టిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగా పోలింగ్ వరకు చేపట్టాల్సిన ఎత్తుగడలపై అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు సమాచారం. పలువురు నేతలతో ఒక బృందం ఏర్పాటు చేసి పోల్ మేనేజ్మెంట్ అప్పగించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ, 2019 లోకసభ ఎన్నికల సమాచారం టిఆర్ఎస్ సేకరించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బూత్ల వారీగా కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు, టిఆర్ఎస్కు వచ్చిన ఓట్లపై సమాచారం విశ్లేషించారని తెలుస్తోంది. కాంగ్రెస్కు కొంత పైచేయి ఉన్న పోలింగ్ బూత్లపై టిఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. అక్కడ టిఆర్ఎస్ పైచేయి సాధించేందుకు అవసరమైన కార్యచరణను నేతలు అమలు చేస్తున్నట్టు సమాచారం. ఇటు కాంగ్రెస్కు పట్టు ఉందని భావించే మండలాలపైనా టిఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ను బలహీనపరిచే పనిలో టిఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మొహరించిన టీఆర్ఎస్ ప్రత్యర్ధికి ఏ చిన్నా చాన్స్ ఇవ్వకుండా వ్యూహాలకు పదును పెడుతుంది. మరో పక్క కేసీఆర్ సభతో ఎన్నికల వాతావరణాన్ని గులాబీ పార్టీకి సానుకూలంగా మార్చాలని చూస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేయడంతో గెలుపొందామని భావిస్తున్న టిఆర్ఎస్ అదే తరహా వ్యూహం నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అమలు చేస్తోంది. ఇలా చేస్తే సాగర్ ఉప ఎన్నికలో గెలుపు గ్యారెంటీ అని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది.