హైదరాబాద్ ఏప్రిల్ 15 రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30వ తేదీన పోలింగ్ 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు
తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22.చివరితేదీ .
ఆ మూడు మున్సిపాలిటీలకు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జడ్చర్ల – బీసీ మహిళ, నకిరేకల్ – బీసీ జనరల్, కొత్తూరు – జనరల్ మహిళకు కేటాయించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు లాటరీ తీశారు. ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్ల జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 66, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు, సిద్దిపేటలో 43 వార్డులకు, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డుకు, నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డుకు, జల్పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డుకు, అలంపూర్ మున్సిపాలిటీలోని 5వ వార్డుకు, బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డుకు, పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డుకు, మెట్పల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డుకు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డుకు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్కు ఎన్నికలు నిర్వహించనున్నారు.