YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్... కేంద్రానికి నోటీసులు

విశాఖ స్టీల్ ప్లాంట్... కేంద్రానికి నోటీసులు

విజయవాడ, ఏప్రిల్ 15, 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీజేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలని కేంద్రాన్ని కోరామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీకి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆధునిక యంత్ర పరికరాలతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖ ఉక్కు పరిశ్రమ నడుస్తోందన్నారు. ఈ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.43,700 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఇంకా లేఖ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.స్టీల్ ప్లాంట్ విక్రయం కాకుండా ప్రధాని మోదీకి లక్ష్మీనారాయణ పలు ప్రత్యామ్నాయాలను సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ (వీఎస్‌పీ)ని ఎన్‌ఎండీసీలో విలీనం చేయడం ఒక ప్రత్యామ్నాయం అని తెలిపారు. తర్వాత వీఎస్‌పీ-ఎన్ఎండీసీని సెయిల్‌లో విలీనం చేసి మెగా స్టీల్ దిగ్గజాన్ని రూపొందించొచ్చన్నారు. ఇందులో ముడి ఇనుప ఖనిజ గనులు ఉన్న కేఐఓసీఎల్ లాంటి పరిశ్రమలను విలీనం చేయొచ్చన్నారు. మెగాస్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ముడి వస్తువుల ఖర్చు, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు.మరో ప్రత్యామ్నాయంగా.. రాష్ట్రపతి పేరిట ఉన్న స్టీల్ ప్లాంట్ భూమిలో 16,872 ఎకరాలను ప్లాంట్‌కు బదలాయించాలని లక్ష్మీనారాయణ కోరారు. దీని వల్ల తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ముందుకొస్తాయన్నారు. విస్తరణ కోసం అట్టిపెట్టిన 2830 ఎకరాలను కేంద్రం తీసుకొని పరిశ్రమల అభివృద్ధి కోసం వాడుకోవచ్చని.. ఇలా చేయడం ద్వారా రూ.9 వేల కోట్లు సమకూరుతాయన్నారు. స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే తక్షణంగా రూ.5 వేల కోట్లు అవసరమని.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్ ఆస్తుల విక్రయం ద్వారా ఈ మొత్తం సమకూరుతుందన్నారు.‘పటేల్ విగ్రహం కోసం వాడిన 3200 టన్నుల స్టీల్‌ను విశాఖ ఉక్కు పరిశ్రమలోనే తయారు చేశారు. అటల్ టన్నెల్ కోసం 8 వేల టన్నుల స్టీల్‌ను ఇక్కడి నుంచి పంపారు. పోలవరం ప్రాజెక్టుకు 18 వేల టన్నుల స్టీల్‌ను విశాఖ ఉక్కు పరిశ్రమే అందించింది. నాగ్‌పూర్-ముంబై జాతీయ రహదారి కోసం 8500 టన్నుల స్టీల్‌ను విశాఖ స్టీల్ ఉత్పత్తి చేసింద’నే విషయాన్ని ప్రధాని మోదీకి లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించుకోవడం కోసం ప్రత్యామ్నాయాలను ఆలోచించి... తెలివిగా పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలి. తద్వారా పరిశ్రమను బతికించుకోవడంతోపాటు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడొచ్చు’ అని లక్ష్మీ నారాయణ సూచించారు

Related Posts