తిరుపతి
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ప్రచారానికి వచ్చిన ఇతర ప్రాంతాల నేతలు సాయంత్రం వెళ్లి పోవాలని అధికారులు సూచించారు. మూడు వారాల పాటు సాగిన ప్రచారం ముగియడంతో ఇక పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సిద్దమయ్యారు. ఈ నెల 17 వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ తీవ్రత కారణం గా పోలింగ్ సమయం పెంచారు. ప్రతిపక్ష పార్టీ ల నుంచి ఆగ్రనేతలు ప్రచారం లో పాల్గొన్నారు. అధికార వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు తీసుకుని పర్యటనలు చేసారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు రోడ్ షోలు, సభలు నిర్వహించారు. జనసేన, బీజేపీ ల ఉమ్మడి అభ్యర్థి కోసం బీజేపీ నుంచి నడ్డా, జనసేన నుంచి పవన్ ప్రచారం చేసారు. నెల రోజులుగా తిరుపతి లోనే మకాం వేసిన సోము వీర్రాజు, ఇతర నేతలు అభ్యర్ది రత్నప్రభ విజయం కోసం అన్ని వర్గాలను కలిసారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నెల్లూరు జిల్లా, మూడు చిత్తూరు జిల్లాలో వున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 55 శాతం ఓట్ల తో 2.28 లక్షల మెజారిటీ సాధించారు. ఈ సారి ఆరు లక్షల మెజారిటీ అని వైకాపా నేతలు అంచనాలు చేస్తున్నారు.