నెల్లూరు
వైసీపీ వాలంటీర్లతో రాజకీయం చేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు మీడియాతో మాట్లాడుతూ సీఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణుల పనైపోయిందన్నారు. వారిని చూస్తే జాలేస్తోందని, ఒక్కో వాలంటీర్కు 5 వేలిచ్చి వారి చేతుల మీదుగా రాజకీయం చేయిస్తున్నారని ఆరోపించారు.తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో వాలంటీర్లకు 11 కోట్ల వరకు పంచారని సోమిరెడ్డి ఆరోపించారు. మొత్తానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలను డమ్మీలుగా మిగిల్చేశారని, వాళ్ల పార్టీ కార్యకర్తలకు వాళ్లు టోపీ పెట్టుకోవడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి వాలంటీర్లకు గౌరవవేతనం ఇస్తూ వారితో రాజకీయం చేయించడం దుర్మార్గమన్నారు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి టీచర్లను, రెవెన్యూ అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటామంటే వ్యవస్థలు ఏమైపోతాయని ప్రశ్నించారు. ఇది సహించరాని విషయమన్నారు. ఎన్నికల సంఘం దీనిని తీవ్రమైన పరిణామంగా భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.