అమరావతి
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల అధికారికి చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. ప్రక్కన ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, జిల్లాల నుండి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి చొరబడ్డారు అని లేఖలో పేర్కొన్నారు.
తిరుపతి పార్లమెంటులోని సరిహద్దు ప్రాంతాలలోని చెక్ పోస్ట్ ల వద్ద సరైన నిఘా లేదు అని మరింతగా నిఘా పెంచాలి అని చంద్రబాబు కోరారు. నిఘా లేకపోవడంతో అనేక మంది బయటి వ్యక్తులు లోపలికి చొరబడుతున్నారు. ఈ రోజు జరిగే పొలింగ్ లో అక్రమాలకు పాల్పడేందుకు చీకటి మంతనాలు జరుపుతున్నారు.ఊర్లలో లేనివాళ్ళు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన ఓటర్లను గుర్తించి ఉదయాన్నే రిగ్గింగ్ చేసుకోవడానికి అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని విమర్శించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు బయట వ్యక్తులు భారీగా వచ్చి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఇదివరకే తెలియజేసింది. పుంగనూరు నుండి బస్సులలో భారీ సంఖ్యలో తిరుపతి పార్లమెంటు లోకి వస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో, ప్రత్యేకంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో అదనపు కేంద్ర బలగాలను మోహరించి బయటి వ్యక్తులను నియంత్రించండి అని చంద్రబాబు కోరారు.