కోల్కతా ఏప్రిల్ 19
కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదు అవుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని మమత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ కోల్కతాలో ఇకపై ఎన్నికల ప్రచారం చేయరు. ప్రచారం చివరి రోజు ఏప్రిల్ 26న కోల్కతాలో సాధారణ సమావేశాన్ని మాత్రమే నిర్వహిస్తారు. జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభలను కూడా 30 నిమిషాలకే పరిమితం చేస్తున్నట్లు ఓబ్రెయిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 8,419 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,59,927కు చేరింది. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా ఎన్నికల సంఘం కుదించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే ఐదు విడుతల ఎన్నికలు ముగిశాయి. మరో మూడు విడుతల ఎన్నికలు జరగాల్సి ఉంది.