ఓటును నోటుతో కొనే అభ్యర్థులకే కర్ణాటక ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తున్నారు. కాంగ్రెస్, భారతీయజనతా పార్టీ, జనతాదళ్, పార్టీలు కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించారు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల లక్షాధికారులకు కేటాయించినా అవి నామమాత్రమే అని చెప్పాలి. మిగిలిన అభ్యర్థులు వందల కోట్లనుంచి వేల కోట్ల ఆస్తులు ఉన్నవారేనని స్పష్టంగా తెలుస్తుంది. 2013 ఎన్నికల్లో వెయ్యికోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు ఎవరూ లేక పోగా ఈసారి మాత్రం వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఈసారి బరిలో నిలిచిన వారిలో ప్రియాకృష్ణ, నాగరాజులు వెయ్యి కోట్లుకు పైగా ఆస్తులున్నట్లు వారి నామినేషన్ అఫిడివిట్లో పేర్కొన్నారు. గోవిందారాజ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియా కృష్ణ 1020 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. హోస్ కోట్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగరాజు 1010 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో వందల కోట్ల ఆస్తులు కలిగిన వీరు వేల కోట్ల ఆస్తులకు పడగలెత్తడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బరిలో నిలినిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 32.6 కోట్లు కాగా బీజేపీ అభ్యర్థుల సగటు 13.2 కోట్లు జేడీఎస్ అభ్యర్థల సగటు 12.8 కోట్లు అభ్యర్థుల ఆస్తుల విలువ గణనీయంగా పెరిగినందున ఈసారి సగటు వారి ఆస్తుల సగటు విలువ రెట్టింపు అవుతుందని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. అయితే బెంగళూరు బరిలో నిలిచిన అభ్యర్థుల్లో వందల కోట్లు ఆస్తులు ఉన్న వారు సైతం వంద కోట్ల లోపే ఆస్తులు చూపడం పలు విమర్శలకు అవకాశం ఇస్తుంది. బరిలో ఉన్న ఓ అభ్యర్థి అనేక భవనాలు నిర్మించి ఐటీ సంస్థలకు అద్దెకిచ్చారు. అయన వంద కోట్ల లోపే ఆస్తుల ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. బెంగుళూరు పరిధిలోని 28 శాసనసభ నియోజక వర్గాల్లో అభ్యర్థుల్లో 90 శాతం అభ్యర్థులు 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవారే. ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి 167 కోట్ల ఆస్తులతో ముందు వరుసలో ఉన్నారు. సిధ్దారామయ్య 20.35 కోట్లు, యడ్యూరప్ప 6.54 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2013 ఎన్నికల నుంచి ఇప్పటికి కుమారస్వమి ఆస్తుల విలువ 20 కోట్ల మేర పెరిగాయి. సిద్ధరామయ్య ఆస్తులు 7 కోట్లు, ఎడ్యూరప్ప ఆస్తులు 70 లక్షల వరకు పెరిగాయి. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ 11.6 కోట్లు ఆస్తులను వెళ్లడించారు. విద్యత్ శాఖా మంత్రి కనకపుర కాంగ్రెస్ అభ్యర్థి డికే శివకుమార్ 841 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2013 ఎన్నికల్లో 253 కోట్ల ఆస్తులుగా ప్రకటించారు.ఆయన ఆస్తులు ఐదేళ్ళలో రెండున్నర రెట్లు పెరిగాయి. 2013 ఎన్నికల్లో పోటీ పడినవారిలో ఎక్కువ మంది మళ్లీ పోటీ పడుతున్నారు. అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ కోటీశ్వరులైన అభ్యర్థుల వివరాలు పేర్కొంది. కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో 218 స్థానాల్లో 148 మంది పాత వారినే బరిలోకి దింపుతుంది. వీరిలో 128 మంది కోటేశ్వరులే ఉన్నారు. జేడిఎస్ మొదటి జాబితాలో 126 మందిని ప్రకటించగా 58 మంది పాత వారే. వీరిలో 46 మంది కోటేశ్వరులే. బీజేపీ ప్రకటించిన 154 మందిలో 111 మంది పాతవారే కాగా వీరిలో 97 మంది కోటేశ్వరులే న్నారు.