నాసిక్ ఏప్రిల్ 21
కరోనా వేళ మహారాష్ట్రలోని నాసిక్ లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్ లీకై 22 మంది రోగులు మృతి చెందారు. నాసిక్లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్ వద్ద ఈ దుర్ఘ టన చోటుచేసుకున్నది. ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లీకవుతున్న ఆక్సిజన్ను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రిటికల్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం వస్తున్నది.లీకేజీ ఘటనతో సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. బాధితులంతా వెంటిలేటర్లపై ఆధారపడి ఉన్నారు. వాళ్లకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. సుమారు 150 మంది రోగులు ఆక్సిజన్పై ఆధారపడి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై శీఘ్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.నాసిక్లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రాథమిక సమాచారం మేరకు 22 మంది మరణించినట్లు తెలుస్తోందని, ఈ ఘటన గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నామని, దీని పట్ల దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగానే తెలిపారు.