ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీ ముగిసింది. మంత్రి అఖిల ప్రియ, తెలుగుదేశం నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిలతో శుక్రవారం భేటీ అయిన చంద్రబాబు వారిరువురి మధ్యా రాజీ కుదిర్చారు. గొడవలుంటే కూర్చుని మాట్లాడుకోవాలని, అంతే కానీ రచ్చకెక్కి పార్టీని పలుచన చేయడం తగదని వారికి చెప్పారు. మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.. ఇక నుంచి ఐకమత్యంతో అందరినీ కలుపుకుపోయి పని చేస్తామని మంత్రి అఖిల ప్రియ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు. జరిగిన వ్యవహారాలు బాధాకరం. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు వచ్చేలా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వివాదాలు కూర్చొని మాట్లాడుకుంటే సమిసిపోతాయి. అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ మాకు ఎంతో చేసింది. మా నాన్న లేకపోయినప్పటికీ పార్టీ మాకు ఎంతో ఆదరణ చూపారు. ఏవి సుబ్బారెడ్డి గారు ఏది చెబితే అది చేస్తాం. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు.
పార్టీ కోసం ఇరువురం కలిసి పని చేస్తామని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఉన్న పూర్తి వివాదాలు సీఎం పరిష్కరించారు. ఇద్దరమూ కలసి పార్టీ కోసం పనిచేస్తాను. టీడీపీ అభివృద్ధి మా లక్ష్యమని అన్నారు. ఈ భేటీపై పార్టీ కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వ్యవహారం చిన్నదేనని అన్నారు. ఇద్దరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తారు. అళ్లగడ్డ వివాదం టీ కప్పులో తుఫాన్ లా సమిసిపోయిందన్నారు.