న్యూఢిల్లీ, ఏప్రిల్ 22,
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ అల్లాడిస్తున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఒకవైపు బెడ్స్ లేని పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. దీంతో కరోనా రోగులకు చికిత్స అందించలేని దీనస్థితి. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక రోగులను డిశ్చార్జ్ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు చెబుతున్నాయి.ఢి ల్లీలోని శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈఓ సునీల్ సాగర్, తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉన్నదని తెలిపారు. కేవలం రెండు గంటల్లో అది కూడా అయిపోతుందని చెప్పారు. ఈ పరిస్థితిలో రోగులు చనిపోతారని, అందుకే వారిని డిశ్చార్జ్ చేయమని వైద్యులను కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నోయిడాలోని కైలాష్ హాస్పిటల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. మరి కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉన్నదని గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రితు బోహ్రా తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్లో తమకు 4 ఆస్పత్రులు ఉన్నాయని, అన్నింట్లోనూ ఆక్సిజన్ సంక్షోభం ఉందన్నారు. 36 గంటల తర్వాత ఆక్సిజన్ సరఫరా అందుతుందని తమకు చెప్పారని, దీంతో కొత్తగా రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు.