2019 లో తెలంగాణలో బిజెపి పాగా వేయడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.జూన్ నుంచి జనంలోకి బిజెపి యాత్రలకు శ్రీకారం చుట్టునున్నట్లు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ తెలిపారు. దాదాపు 50 అసెంబ్లీ కేంద్రాల్లో భారీ ఎత్తున సభలు నిర్వహించనున్నట్లు డాక్టర్ లక్ష్మన్ వెల్లడించారు.కేంద్రం రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్రమోదీ వివిధ పథకాల అమలు చేస్తున్నారని.. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా.. నిధులు కేంద్రానివి-ప్రచారం రాష్ట్రానిదని అన్నారు.ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న పథకాలపై.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో చర్చలకు సిద్ధమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపిని గెలిపిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. 2014లో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న బిజెపి.. ఇవాళ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. ఓటమి పాలైన పార్టీలు కూటమిగా మారి... కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న అన్ని ఘట్టాలను, అంబేద్కర్ జన్మస్థలం మౌ గ్రామం, న్యూఢిల్లీ, నాగ్పూర్ అలాగే అంబేద్కర్ చదివిన లండన్ వంటి ప్రాంతాలను మోదీ ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దేశానికి దళిత మేధావిని రాష్ట్రపతిగా చేసిన ఘనత బిజెపిదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న మోదీ.. దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాని ఫసల్ బీమా యోజన, బేటీ పడావో-బేటీ బచావో, ప్రధానమంత్రి సురక్ష యోజన, బాలికా సమృద్ధి పథకం వంటి అనేక పథకాలు అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఆరోగ్య వైద్యశాలలకు కేంద్రం 3 వేల కోట్లు ప్రకటించిందని, తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి, రంగారెడ్డి, శంషాబాద్లో 1500 కోట్ల నిధులతో రోడ్లు, రహదారుల అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. కేవలం అధికార యావ తప్పా... జెండా.. ఎజెండా లేని కొన్ని పార్టీలు మోదీపై చౌకబారు విమర్శలకు దిగడం దారుణమని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త పాట పాడుతున్నారని డాక్టర్ లక్ష్మన్ ఎద్దేవా చేశారు. ఏపీకి ఫ్యాకేజీకి మించినది లేదని చెప్పిన చంద్రబాబు ఇవాళ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ.. బిజెపిని బూచిగా చూపుతున్నారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. రాష్ట్రంలోని నియంతృత్వ పోకడలు, కుటంబ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.