YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భరత్ రామ్ కు కార్పొరేషన్ సవాల్

భరత్ రామ్ కు కార్పొరేషన్ సవాల్

రాజమండ్రి, ఏప్రిల్ 23, 
జగన్ తుఫాన్ లో కూడా రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో టిడిపి హవాకి ఢోకా లేకుండా పోయింది. మొదటి నుంచి టిడిపి కంచుకోటల్లో చారిత్రిక రాజమహేంద్రి కూడా ఆ పార్టీకి ఒకటి. ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక జరిగిన మూడు ఎన్నికల్లోనూ మేయర్ స్థానాలు గెలిచి హ్యాట్రిక్ నెలకొల్పిన చరిత్ర పసుపు దళానిది. ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికలకు రాజమహేంద్రి నోచుకోలేదు. అయితే మరికొద్ది నెలల్లో కోర్టు వివాదం పరిష్కారం అయ్యి ఎన్నికలకు రెడీ అవుతుందనుకుంటున్న సమయంలో టిడిపి కోటకి బీటలు మొదలు అయ్యాయి. పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం రాజమహేంద్రి టిడిపి పై బాగా ప్రభావితం చేసినట్లే కనపడుతుంది. స్థానిక ఎన్నికలకు ముందు ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్ ల స్థాయి పార్టీకి దూరం జరిగినా పెద్దగా నష్టం లేదని ఆ పార్టీ అంచనా వేసుకుంది. ఏపీ లో ప్రాంతాలకు అతీతంగా వచ్చిన జగన్ సునామీ చూశాక రాజమండ్రి పార్టీలో అధికారపార్టీవైపు నేతలు చూడటం మొదలు పెట్టారు. మాజీ కార్పొరేటర్ లు గా ఉన్న సీనియర్ నాయకులు పాలిక శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్ మరికొందరితో కలిసి ఇటీవల గోడ దూకేయటం టిడిపి క్యాడర్ లో నైరాశ్యాన్ని నింపింది. రాబోయే ఎన్నికల ముందు ఇవన్నీ దుశ్శకునాలేనా అన్న అనుమానాలు పసుపు దళం లో బాగా పెరిగిపోతున్నాయి.ప్రస్తుతం రాజమండ్రి లో వైసిపి అన్ని డివిజన్ లలో టిడిపి తో పోలిస్తే బలంగా లేదు. ఎంపి భరత్ రామ్ చురుగ్గా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నా కొత్త కో ఆర్డినేటర్ లు డా. ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్ లు ఇంకా పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే టిడిపి కి నాలుగోసారి మేయర్ ఖాయం అయ్యే పరిస్థితి ఉందన్నది విశ్లేషకుల అంచనా. అయితే టిడిపి లో ప్రస్తుతం పాలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల నడుమ ఇంకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతవరణమే ఉంది. గోరంట్లకు బలమైన క్యాడర్ ఉన్నా ఆ వర్గానికి ఆదిరెడ్డి వర్గం పక్కన పెట్టేసి కార్యక్రమాలు సాగిస్తుంది. ఈ నేపథ్యంలో బుచ్చయ్య వర్గం గా ఉన్న వారు కొందరు పార్టీకి గుడ్ బై కొట్టేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. రాజమండ్రి లో తన పట్టును టిడిపి లో చాటి చెప్పాలంటే వచ్చే కార్పొరేషన్ ఎన్నికలే ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి గీటురాయి కానున్నాయి. గోరంట్ల కార్పొరేషన్ ఎన్నికలకు దూరం జరిగితే వైసిపి నెత్తిన పాలు పోసినట్లే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రధాన కార్యక్రమాలకు రాజమండ్రి అర్బన్ పార్టీ గోరంట్లను ఆమడ దూరం లో పెట్టేసింది. ఇకపై పార్టీ అధినేత వంటివారు కలగజేసుకుంటే తప్ప వీరిరువురు కలుస్తారన్న గ్యారంటీ లేదు.మరోపక్క ఎంపి భరత్ రామ్ ఆయన కోరి తెచ్చుకున్న టీం కి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలే వారి ప్రతిభకు కొలమానం కానున్నాయి. ఇప్పటికే జగన్ భరత్ అండ్ టీం కి ఏమి కావాలన్న చేస్తా అన్నారని రాజమండ్రి కార్పొరేషన్ పై వైసిపి జండా ఎగరేయాలిసిందే అన్నారని లేకపోతే అందరిని పక్కన పెట్టేస్తా అని హెచ్చరిక జారీ చేసినట్లు చర్చ నడుస్తుంది. భరత్ టీం సక్సెస్ గా ముందుకు వెళ్లాలంటే జక్కంపూడి రాజా వర్గాన్ని కలుపుకుని వెళ్ళాలి. అయితే ఆ దిశగా ఎలాంటి అడుగులు పెద్దగా పడినట్లు కనిపించడం లేదు. రెండు ప్రధాన పార్టీల్లోనూ వేరు కుంపట్లు ఆయా శిబిరాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మరి ఏమి జరగనుందో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కానీ చెప్పలేవు.

Related Posts