ముంబై ఏప్రిల్ 23
మహారాష్ట్రలోని ఓ కరోనా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ దవాఖానలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దవాఖానలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది సజీవ దహణమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దవాఖానలోని రోగులను సమీపంలోని హాస్పిటళ్లకు తరలించారు. ఫైర్ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్నట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.