న్యూఢిల్లీ ఏప్రిల్ 23 గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణి కరోనా మహమ్మారి దేశమంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్నది. రోజూవారీ కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును కూడా దాటింది. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్ధిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, దీని కోసం తాము రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.