న్యూఢిల్లీ ఏప్రిల్ 24
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసిన విషయం విదితమే.కొవిడ్ దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలోనే జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్తో పాటు అతిథులందరూ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందిన నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతులకు 1957, ఆగస్టు 27న ఎన్వీ రమణ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కంచికర్ల ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అమరావతి ఆర్వీవీఎన్ కాలేజీలో బీఎస్సీ చదివారు. 1982లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1983, ఫిబ్రవరి 10న ఎన్వీ రమణ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సీఏటీ, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేశారు. ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషీయల్ అకాడమీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000, జూన్ 27న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా సేవలందించారు. 2013, మార్చిలో ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పని చేశారు. 2013, సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 2014, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. సీజేఐగా నియమితులైన వారిలో రెండో తెలు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. 1966లో తొలిసారి సీజేఐగా జస్టిస్ కోకా సుబ్బారావు నియమితులయ్యారు.