న్యూఢిల్లీ ఏప్రిల్ 24
దేశంలో కరోనా దుస్థితిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. దేశంలో కరోనా కేసుల కట్టడి.. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్ల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని ఇటీవల ఆరోపించిన ఆయన.. శనివారం కొవిడ్ మహమ్మారి మధ్య అనవసర ప్రాజెక్టులపై ఖర్చు చేయకుండా టీకాలు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్యసేవలపై దృష్టి సారించాలని సూచించారు. కొవిడ్ సంక్షోభం మధ్య కేంద్ర ప్రజాపన్నుల శాఖ మంత్రిత్వశాఖల భవన నిర్మాణం కోసం ఇటీవల టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని, దాన్ని ఎదుర్కొందునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత దుస్థితి భరించలేనిదని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం దేశంలో రికార్డు స్థాయిలో 3.46లక్షల కరోనా కేసులు రికార్డయ్యాయి. 2,624 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.