న్యూఢిల్లీ ఏప్రిల్ 24
ఆక్సిజన్ కొరత తీవ్రమవుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వ్యక్తిని ఉరితీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆక్సిజన్ కొరతపై మహారాజా అగ్రసేన్ హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సింఘి, జస్టిస్ రేఖా పల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న ఒక్క ఘటన గురించి మాకు చెప్పండి.. మేము ఆ వ్యక్తిని ఉరి తీస్తాం అని ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పింది హైకోర్టు. తాము ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేసింది. అలాంటి అధికారుల గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాలని, వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పింది. ఈ నెల 21న ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని కేంద్రం చెప్పింది. అది ఎప్పుడు వస్తుందో చెప్పాలి అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.