ఇండోర్ ఏప్రిల్ 24, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు కరోనా వైరస్ సోషల్ మీడియాలో పుకార్ల వార్తలు..గుర్తు తెలియని వ్యక్తిపై కేసును నమోదు
లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కరోనా వైరస్కు గురై చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్ల వార్తలు షికార్లు చేశాయి. మాజీ కౌన్సిలర్ సుధీర్ డెడ్జ్ ఫిర్యాదు మేరకు సరాఫా పోలీస్ స్టేషన్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్ 188 కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి.జ్వరం రావడంతో సుమిత్ర మహాజన్ ఇండోర్లోని బొంబాయి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కరోనా నెగెటివ్గా తేలింది. కానీ వైద్యులు ఇంకా ఆమెను దవాఖాన నుంచి డిశ్చార్జీ చేయలేదు. ఆమెకు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా జరుపుతున్నట్లు దవాఖాన యాజమాన్యం తెలిపింది. సోషల్ మీడియాలో సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు షికార్లు చేయడంతో మాజీ కౌన్సిలర్ సుధీర్ డెడ్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సుమిత్ర మహాజన్ కుటుంబంలోని ఇద్దరు సభ్యులు కరోనా బారిన పడ్డారు.తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయడం పట్ల సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నన్నే నేరుగా అడగాల్సిందని, లేదంటే ప్రభుత్వాన్ని తెల్సుకుని వార్తలు రాయాల్సి ఉన్నదన్నారు. ఏదేమైనా ఇలాంటి వార్త తన వయసును పెంచిందని సుమిత్ర మహాజన్ వ్యాఖ్యానించారు.ఇలాఉండగా, ఈ తప్పుడు వార్తలను బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా తీవ్రంగా ఖండించారు. సుమిత్ర మహాజన్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు.