YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అందరికి ఫ్రీ వ్యాక్సిన్

అందరికి ఫ్రీ వ్యాక్సిన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24, 
కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్‌ను రూ.150లకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్‌లు కొనుగోలుకు అవకాశం కల్పించింది.వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రయివేట్ ఆస్పత్రులకు రూ.600లుగా నిర్ణయించింది. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేస్తున్నాయి.ఈ అంశంపై కేంద్రానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాయగా, మోదీని టార్గెట్ చేస్తూ పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్ ధ‌ర‌ల విధానం వివ‌క్ష‌పూరితంగా ఉంద‌ని, పునఃస‌మీక్షించుకోవాల‌ని సోనియా డిమాండ్ చేశారు. పౌరుల‌కు ఉచిత వ్యాక్సిన్ అందించాల‌న్న అంశం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసిన‌ట్లుంద‌ని ఆమె విమర్శించారు. ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌ను వేర్వేరు ధ‌ర‌లకు అమ్మ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు.‘‘అన్ని సమయాల్లోనూ ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే నేత పాలన అంటూ బీజేపీ గగ్గోలు పెడుతుంది.. కానీ, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఒకే ధర అమలుచేయడం లేదు.. కులం, మతం, ప్రాంతం, వయసు బేధం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడికీ ఉచిత టీకా అవసరం.. కేంద్రం, రాష్ట్రాలు చెల్లిస్తాయనే అనే బేధం లేకుండా భారత ప్రభుత్వం దేశమంతా ఒకే ధరను నిర్ణయించాలి’’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.దీంతో వ్యాక్సిన్ల ధరలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే శనివారం కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాక్సిన్ల ధరలను తప్పుపట్టారు. వ్యాక్సిన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 చెల్లించడం అంటే అమెరికా, యూకే, ఈయూ, సౌదీ, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా చెల్లించే దానికంటే ఎక్కువ అన్నారు. మేడిన్‌ ఇండియా టీకాకు అత్యధిక ధరనా? అని ప్రశ్నించారు. రూ.150కే విక్రయించినా కంపెనీ లాభాలు పొందుతుందన్నారు. ధరలపై మరోసారి పునరాలోచించాలని కేంద్రానికి సూచించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే ఉచితంగా సరఫరా చేయనున్నట్లు స్పష్టతనిచ్చింది.

Related Posts