రెండు రోజుల్లో అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ భారతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దిగివస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 29 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆ ప్రభావంతో అండమాన్ నికోబార్తో పాటు తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. వాయువ్య భారత్ నుంచి వీస్తోన్న వేడి గాలుల ప్రభావానికి తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణ మీదుగా ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్ర గరిష్ఠానికి చేరుకుంటోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆరు డిగ్రీల వరకు పెరుగుదల నమోదైందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. విదర్భలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని అత్యధికంగా తిరుపతిలో 44 డిగ్రీలు, విజయవాడ, అమరావతి, గుంటూరులలో 42 డిగ్రీల సెల్షియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో మండిపోతోన్న ఆంధ్రప్రదేశ్కు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది.