YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

అమెరికన్లకే ఫస్ట్... తర్వాత ఎవరికైనా

అమెరికన్లకే ఫస్ట్... తర్వాత ఎవరికైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24, 
భారత్‌కు అగ్రరాజ్యం ఊహించని షాక్ ఇచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి వినియోగించే కీలక ముడిపదార్థాల ఎగుమతులపై ఇటీవల విధించిన నిషేధాన్ని అమెరికా సమర్ధించుకుంది. తమ తొలి ప్రాధాన్యం అమెరికా పౌరులకేనని, ఈ విషయంలో మరోసందేహమే లేదని బైడెన్ యంత్రాంగం స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయంతో వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతి భారత్‌కు నిలిచిపోగా, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత జాప్యం చోటుచేసుకుంటుందనే ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీకా ముడిపదార్ధాలను తమకు సరఫరా చేయాలని భారత్ అభ్యర్ధించింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. "అమెరికాకు అమెరికన్లే తొలి ప్రాధాన్యం.. ఇంతవరకూ కరోనా వ్యాక్సినేషన్‌లో విజయవంతం అయ్యాం... భారత్ వినతిని పరిశీలించాం.. దీన్ని తోసిపుచ్చడానికి మాకు రెండు కారణాలు ఉన్నాయి.. వాటిల్లో ఒకటి దేశంలోని ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యతను మేము తీసుకున్నాం.. రెండోది అమెరికా ప్రజలు. కరోనా కారణంగా మా దేశం ఎంతో నష్టపోయింది. దాదాపు ఐదున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ లక్షలాది కేసులు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.అమెరికన్లకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఇచ్చిన తరువాత మిగతా ప్రపంచ అవసరాలను తీర్చేందుకు ముందుంటామని నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. ‘‘కరోనా వైరస్ అన్ని చోట్లా వ్యాపిస్తోంది.. మ్యుటేషన్ చెందుతూ సరిహద్దులను దాటుతోంది.. తొలుత అమెరికాలో ఈ మహమ్మారిని పూర్తిగా నియంత్రణలోకి తేవాలన్నదే తమ అభిమతం..
మేము మొదటి బాధ్యతకు అనుగుణంగా సాధ్యమైనంతవరకు ఎల్లప్పుడూ చేస్తాం’’అని ఆయన ఉద్ఘాటించారు.అమెరికన్ కంపెనీలు దేశీయ వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే చట్టమే వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతుల్లో ప్రస్తుత ఇబ్బందులకు ప్రధానం కారణం. కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షపీఠం నుంచి దిగిపోవడానికి ముందు యుద్ధ సమయంలో వినియోగించే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (డీపీఏ)ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు కోవిడ్ -19 టీకాలు, పీపీఈ కిట్లను ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు.అమెరికా తన ప్రజలందరికీ జూలై 4 నాటికి వ్యాక్సిన్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ ఫైజర్, మోడెర్నా టీకాలను అత్యవసర వినియోగం కింద అనుమతించారు. టీకా తయారీకి వాడే ముడిపదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటు, భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రుల్లో పదులు సంఖ్యలో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతోంది. 

Related Posts