దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు, క్యాస్టింగ్ కౌచ్ వివాదాలు దుమారం రేపుతున్న తరుణంలో బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. మల్లిక కథానాయికగా నటించిన చిత్రం ‘దాస్ దేవ్.’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా భారత్లో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మల్లిక మీడియా ద్వారా స్పందించారు.‘దేశంలో పిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు సిగ్గుచేటు. గాంధీజీ తిరిగిన ఈ భారతదేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారింది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో మీడియానే ఏదో ఒకటి చేయగలదు. మీడియా లేకపోతే కథువా, ఉన్నావ్ లాంటి కేసులు బయటికి వచ్చేవే కావు. మీడియా తెచ్చిన ఒత్తిడి కారణంగానే మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం వచ్చింది. ఇందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.’అని వెల్లడించారు.జమ్ముకశ్మీర్లోని కథువా, ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. మృగాళ్ల అఘాయిత్యానికి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం, బాధ్యతగల పదవిలో ఉండి ఓ భాజపా ఎమ్మెల్యే బాలికపై అత్యాచారం చేయడం దేశ ప్రజలను కలచివేసింది. ఈ రెండు కేసుల్లో న్యాయం జరిగేవరకూ పోరాడతామని ప్రజలతో పాటు సెలబ్రిటీలూ ముందుకు వచ్చారు.