వరంగల్ ఏప్రిల్ 25,
ఓరుగల్లు ప్రజల్లో కాకతీయుల రక్తం ప్రవహిస్తోంది... పౌరుషాల గడ్డ ఓరుగల్లు.. ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆల్రేడీ వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే అని చెప్పారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే కబ్జాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.రౌడీ షీటర్లు, తలలు నరికిన వారికి, నగర బహిష్కరణ చేసిన వ్యక్తులకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కునేలకు రాయాలని చెప్పారు. వరంగల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసింది, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని తెలిపారు. అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలిందన్నారు. సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.