YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిన్నొదలా అంటున్న ఆళ్ల

నిన్నొదలా అంటున్న  ఆళ్ల

గుంటూరు, ఏప్రిల్ 26, 
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక డిఫరెంట్ లీడర్. రెండు సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. సగం సమయాన్ని ప్రజాసేవకు, మిగిలిన సమయాన్ని వ్యవసాయానికి కేటాయిస్తారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు చెబితే వైసీపీ క్యాడర్ లో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. జగన్ కు అండగా నిలవడమే కాకుండా చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో జగన్ తర్వాత హీరోగా మారిపోయారు. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించారు. ఆర్థిక సమస్యలే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో జగన్ తన వద్దకు పిలిపించుకుని మరీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో ఉంచేలా చేశారు. దీంతో ఆళ్ల తెలుగుదేశం పార్టీ భావినేత నారా లోకేష్ పై ఘన విజయం సాధించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో ఎంత పట్టు ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది.తొలి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ను టార్గెట్ గా చేసుకుని పోరాటం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబును మూడు చెరువుల నీళ్లు తాగించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ కంటే ఆళ్లకే ఎక్కువ భయపడ్డారంటారు. తనపై కేసులు నమోదవుతున్నా ఆయన వెనుకంజ వేయకుండా కృష్ణానదిలో అక్రమ కట్టడాలు, తవ్వకాల నుంచి సదావర్తి భూముల వరకు చంద్రబాబు కంటి మీద కునుకులేకుండా చేయగలిగారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును ఆళ్ల రామకృష్ణారెడ్డి వదిలపెట్టలేదు. కరకట్టపైన ఉన్న నివాసంపై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు కీలకంగా మారింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఈ కేసులో ఎంత బలం ఉందీ? విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబు నిన్ను వదల బొమ్మాళీ అన్న తరహాలోనే వెంటాడుతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్యేకత సంపాదించుకున్నారు.

Related Posts