YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరంగల్ జైల్లో వనం

వరంగల్ జైల్లో వనం

వరంగల్, ఏప్రిల్ 26, 
తెలిసో తెలియకో తప్పులు చేసిన వారు కొందరైతే.. కరుడుగట్టిన నేరస్తులు మరికొందరు ఖైదీలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అధికారులు వీరితో రకరకాల పనులు చేయిస్తూ, కష్టపడి సంపాదించేతత్వాన్ని అలవాటు చేయిస్తున్నారు. దీంతో వారిలో క్రమశిక్షణ, సత్ప్రవర్తన పెంపొంది, నెలనెలా వచ్చే కూలి డబ్బుతో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా సత్ప్రవర్తన కలిగిన సుమారు 30మంది ఖైదీలు సెంట్రల్‌ జైలులో నర్సరీని నిర్వహిస్తున్నారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతూ జైలు ఆవరణను హరితమయం చేశారు. ఇక్కడే చేపల చెరువును కూడా అభివృద్ధి చేశారు.వరంగల్‌ సెంట్రల్‌ జైలు వెనుకభాగంలో దాదాపు ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జైలు లోపల కొందరు రైతులు యాసంగి, వానకాలం పంటలు పండిస్తుండగా, సత్ప్రవర్తన కలిగిన మరో 30మంది వరకు ఖైదీలు ఆరుబయట ఉంటూ నర్సరీ పనులు చూసుకుంటున్నారు. జామ, దానిమ్మ, అల్లనేరేడు, ద్రాక్ష, ఖర్జూర తదితర పండ్ల మొక్కలు, గన్నేరు, మందార, మల్లె, అకాలిఫా, తంగేడు, నందివర్దనం, గులాబీ, బంతి, చామంతి వంటి పూల మొక్కలు, వేప, వెలగ, కానుగ, మద్ది, పెద్ద చెమ్మంగి, తులసి, చింత, రాగితోపాటు ఔషధాలకు ఉపయోగపడే టెకోమా, ఫెడలాంతిస్‌, స్పాథోడియా, స్టాతోడియం, ఆర్‌జెస్సీ టెకొమా, పులిచర్మ, రెయోమల్లె, గుల్మోర్‌, ఫెల్టోపాయ్‌ తదితర మొక్కలు నర్సరీలో పెరుగుతున్నాయి. నర్సరీ నిర్వహణకు కుడా అధికారులు ఆర్థిక సహకారం అందిస్తుండగా, ఖైదీలు వంతులవారీగా పనిచేస్తూ మొక్కల సంరక్షణ చూసుకుంటున్నారు. జైలు ఆవరణలో ఉన్న రెండు పెద్ద బావులు, బోర్ల ద్వారా నీటిని అందిస్తూ మొక్కలను బతికిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న హరితహారానికి సెంట్రల్‌ జైలు నర్సరీ నుంచి మొక్కలను ఉచితంగా అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మొక్కలను పెంచగా, 10 లక్షలు హరితహారం కార్యక్రమానికి అందజేశారు. ప్రస్తుతం నాలుగు లక్షల మొక్కలు పెరుగుతుండగా, మరో 5 లక్షల మొక్కలను పెంచడానికి ఆర్డర్‌ ఇచ్చారు. ఇక్కడినుంచి ప్రైవేట్‌ వ్యక్తులకు కూడా మొక్కలు సరఫరా చేస్తారు. అయితే, వీరు కుడా ద్వారా ప్రత్యేకంగా లెటర్‌ రాయించుకుని ఒక్కో మొక్కకు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆవరణలోని వెనుకభాగంలో 2019 ఏప్రిల్‌ నెలలో నర్సరీని ప్రారంభించారు. దాదాపు 65 రకాలు పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. ఆరుబయట ఉన్న ఖైదీలు నర్సరీ నిర్వహణను చూసుకుంటారు. వీరికి రోజుకు రూ.వంద చొప్పున చెల్లిస్తూ, వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఆ డబ్బులు ఖైదీల కుటుంబ సభ్యుల అవసరాల కోసం పంపిస్తాం. కుడా సహకారంతో జైలులో నర్సరీ విస్తరిస్తున్నది. మొక్కల పెంపకం వల్ల ఖైదీల్లో క్రమశిక్షణ పెరుగడంతోపాటు వారికి ఉపాధి లభిస్తున్నది. ప్రాణం విలువ మాదిరిగా మొక్కలను బతికించడం నేర్చుకుని, జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు.

Related Posts