YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎండగట్టిన వారికే అందలం ఇద్దరూ... ఇద్దరే..

ఎండగట్టిన వారికే అందలం ఇద్దరూ... ఇద్దరే..

హైదరాబాద్, ఏప్రిల్ 26, 
అధికారం ఒక మత్తు. దానికి కావాల్సిన సరుకు రాజకీయం. మరి ఆ రాజకీయానికి అవసరం అయిన ఇంధనం సమకూరితే ఇంక బండి జోరు చేస్తుంది. అధికారంలో రానంతవరకూ ఒక మాట ఉంటుంది. వచ్చాక టోన్ పూర్తిగా మారిపోతుంది. ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలో చూసుకుంటే ఇదే జరుగుతోంది అంటున్నారు. అసలైన వారికి అరిటాకులు, కాని వారికి కంచాలు అన్న రూల్ మాత్రం అక్కడా ఇక్కడా పార్టీ పెద్దలు చక్కగా అమలు చేస్తున్నారు అంటున్నారు.  ముందుగా తెలంగాణా ఊసు చెప్పుకుంటే తెలంగాణా ఉద్యమం కోసం ఎవరూ పాటుపడలేదు, పైగా రాష్ట్రం వస్తుందా ఏంటి అంటూ గట్టిగానే మాట్లాడిన వారున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి కేసీయార్ మీద విమర్శలు చేస్తూ ఆయన అడుగులు ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు. అలాంటి వారు ఇపుడు టీయారెస్ ప్రభుత్వంలో నిండా ఉన్నారు. వారినే పిలిచి మరి మంత్రులను చేసిన ఘనత కేసీయార్ ది అని విమర్శలు ఉన్నాయి. అసలైన తెలంగాణావాదులను పక్కన పెట్టి మరీ కేసీయార్ తన రాజకీయం కోసం ఉద్యమంలో లేని వారిని అందలాలు ఎక్కించారు అని ఇప్పటికీ విపక్షాలు విమర్శలు చేస్తాయి. అంతే కాదు ప్రజసంఘాలు కూడా తప్పుపడుతూంటాయి.జగన్ విషయం తీసుకుంటే కేసీయార్ నే అనుసరించారు అని చెప్పాలి. తాను కాంగ్రెస్ నుంచి ఒక్కడిగా బయటకు నెట్టబడినపుడు, అక్రమంగా జైలు పాలు అయినపుడు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ పెద్ద నేతలు కానీ స్పందించలేదు. పైగా నానా నిందలూ వేశారు. చాలా దారుణంగా మాట్లాడారు. వారి మాటలను పదే పదే జగన్ సొంత మీడియా కూడా ఆనాడు ప్రసారం చేసి జనాల్లో వైసీపీ ఎండగట్టింది. అటువంటి వారిని జగన్ ఆ తరువాత రోజుల్లో అక్కున చేర్చుకున్నారు. అంతే కాదు వారికి కీలకమైన మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇపుడు వైసీపీ ప్రభుత్వంలో వారిదే హవా అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది.అధికారంలో ఉన్న వారి చెంతన అనేక మంది వస్తారు. వారికే భజన చేస్తారు. అటువంటి వారిని అందలాలు ఎక్కించి అసలైన కార్యకర్తలను పట్టించుకోకపోతే చివరికి ఇబ్బంది పడేది పార్టీ పెద్దలే అని అంటున్నారు. జగన్ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు ఏదైనా ఆయనకు సమస్య వస్తే రోడ్డున నిలిచి పోరాటాలు చేసేది నిజమైన కార్యకర్తలే తప్ప ఫిరాయించి వచ్చి మరీ పదవులు అనుభవిస్తున్న వారు కానే కాదని క్యాడర్ అంటోంది. జగన్ ఇకనైనా పార్టీని పట్టించుకుని పదేళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలన్న డిమాండ్ వైసీపీలో ఉంది. మరి జగన్ కి ఈ కార్యకర్త గోడు వినిపిస్తుందా.

Related Posts