వరంగల్ ఏప్రిల్ 26
బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఆయన ఇవాళ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయో చూపించాలన్నారు. పేదింటి ఆడబిడ్డల పాలిట మేనమామలా ఆదుకుంటున్న మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు.ఆరునెలల్లో కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే ఆరునెలల్లో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టకపోతే బీజేపీ నేతలు ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం వస్తే గ్యాస్ సిలెండర్ ముందు పెట్టి బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంటింటీకి తాగునీరు ఇచ్చారా..? అని నిలదీశారు. గోదావరి జలాలతో గొంతుతడి అర్పిన మహానుభావుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని, ఎన్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.