YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం బలం ఎంత

కమలం బలం ఎంత

తిరుపతి, ఏప్రిల్ 27, 
తిరుప‌తిలో జ‌రుగుతున్న పార్లమెంటు ఉప ఎన్నిక‌లో గెలుస్తామ‌ని.. నిలుస్తామ‌ని చెబుతున్న క‌మ‌ల నాథుల ప‌రిస్థితిపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే ప్రీపోల్ స‌ర్వేలు కూడా చేసేందుకు ప‌లు సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్ప‌టి వ‌ర‌కు తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌లు, ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యం.. ఓటు బ్యాంకువంటి అనేక విష‌యాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి. వీటిని ప‌రిశీలిస్తే.. ఆస‌క్తికర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీతో జతకట్టి పోటీ చేసినప్పుడు మినహా మరెప్పుడూ బీజేపీ ఉనికి కనిపించలేదు. ఒంటరిగా పోటీ చేసిన సందర్భాల్లో అత్యధిక సందర్భాల్లో డిపాజిట్లు కూడా గల్లంతు అయ్యాయి.1991 నుంచే బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేస్తోంది. 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. ఈ మూడు ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. 1999లో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి గెలిచారు. ఈ మూడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను ఆ పార్టీ బలంగా చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. పై మూడు మాత్రమే కాకుండా మిగిలిన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు మాత్రమే బీజేపీ బలంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కఓటుతో వాజ్‌పేయిని ప్రధాని గద్దె నుంచి దించిన ప్రభావం తాలూకు సానుభూతి ప్రభావంతో 1998 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థికి లక్ష 78 వేల ఓట్లు వచ్చాయి.మిగిలిన అన్ని సార్లు బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. 1991 ఎన్నికల్లో 21,526, 1996లో 13,315, 2009లో 21,696 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 16,847 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.6 శాతం మాత్రమే. దేశం అంతా మోడీ గాలి వీచినా తిరుపతి పార్లమెంట్‌లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగుతున్నారు క‌మ‌ల నాథులు. ఈ క్రమంలో జ‌న‌సేన‌కు ఉన్నప‌ట్టు ఏంటో కూడా ఆస‌క్తిగా మారింది.బీజేపీకి మిత్రపక్షమైన జనసేన బలానికి వస్తే పార్లమెంట్‌ సెగ్మెంట్‌ వ్యాప్తంగా పవన్‌ కళ్యాణ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రత్యేకించి తిరుపతి, శ్రీకాళహస్తిలలో అభిమానంతో పాటు సామాజికవర్గ అంశం కూడా పవన్‌కు అనుకూలించేదే. అయితే అభిమానాన్ని ఓటుగా మలుచుకోవడంలో పవన్‌ వెనుకబడ్డారనే విషయం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్ట‌మైంది. సామాజికవర్గం, అభిమానం రెండు బలంగా ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితేనే పది వేలకు మించి ఓట్లు రాలేదు. బీజేపీ, జనసేన రెండు పార్టీల పట్ల జనంలో అభిమానం ఉన్నా, దానిని ఓటుగా మలుచుకునేందు కు, ఆ ఓటును పోలింగ్‌ బూత్‌ వరకు నడిపించేందుకు అవసరమైన యంత్రాంగం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలూ క‌లిసి ప‌నిచేసినా.. ఆశించిన విజ‌యం ద‌క్కుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

Related Posts