విశాఖపట్టణం, ఏప్రిల్ 27,
గాజువాక అంటేనే పవన్ కల్యాణ్ అని ఆ మధ్యదాకా ప్రచారం జరిగింది.అంతెందుకు 2019 ఎన్నికల్లో పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తే ఏపీలోనే అత్యధిక మెజారిటీ వస్తుంది అని జనసైనికులు శపధం చేశారు. దానికి కారణం గాజువాకలో మెగా ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఇక పవన్ కల్యాణ్ సామాజికవర్గం కూడా దండీగా ఉంటారు. దాంతో గెలుపు సులువు అని పవన్ భావించే అక్కడ నుంచి పోటీకి దిగారు. కానీ గాజువాకలో అనూహ్యంగా పవన్ ఓడిపోయారు. నాటి నుంచి ఆయన ఈ వూసే తలవడంలేదు.ఇక సీనియర్ కాంగ్రెస్ నేతగా, బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా మాదాసు గంగాధరానికి ఏపీలో కొంత గుర్తింపు ఉంది. ఆయన కాంగ్రెస్ ఏలుబడిలో రెండు సార్లు శాసనమండలి సభ్యునిగా కూడా పనిచేశారు. ఆయన జనసేనలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా కూడా ఉంటున్నారు. ఇపుడు ఆయన సడెన్ గా తన పదవిని రాజీనామా చేశారు. పోతూ పోతూ పవన్ కల్యాణ్ వైఖరి మీద చురకలు అంటించారు. అందులో గాజువాక కూడా ఉంది. గాజువాకలో ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా గుర్తుకు తెచ్చారు.పవన్ కళ్యాణ్ కి విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కొంత బాధ్యత ఉంది. ఆయన పోటీ చేసిన గాజువాకలోనే ఉక్కు పరిశ్రమ ఉంది. కార్మికులు కూడా అక్కడే పెద్ద ఎత్తున ఉంటారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కి వచ్చిన అరవై వేల ఓట్లలో వారి వాటా కూడా ఉంది. అటువంటి కార్మికులు ఇపుడు ఉక్కు కోసం పోరాడుతూంటే పవన్ గొంతు ఎందుకు విప్పరు అన్న ప్రశ్న కూడా ఉంది దాని మీద చాలా మంది పవన్ ని నిలదీశారు కూడా. అయితే వారి కంటే మాదాసు గంగాధరం లాంటి నిన్నటి సహచరులు వేసిన ప్రశ్నే ఇపుడు జనసేనానికి బాగా గుచ్చి ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతూంటే పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడమే కాదు, బీజేపీ నుంచి కచ్చితమైన హామీని తీసుకురాలేకపోయారు అని గంగాధరం అంటున్నారు.పవన్ కల్యాణ్ కి విశాఖలో బలం ఉంది అని అంటారు. మరి అలాంటి చోట ఒక అతి పెద్ద పరిశ్రమ ప్రైవేటీకరణ మీద భారీ ఉద్యమం జరుగుతూంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తాను అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ నోరు కట్టేసుకోవడం అంటే ఆయన రాజకీయ జీవితానికే అది పెద్ద దెబ్బ అంటున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ పార్టీని కూడా సరిగ్గా పట్టించుకోవడంలేదు అన్న మాట కూడా గంగాధరం లేఖలో ఉంది. సినిమా లోకం వేరు, రాజకీయాలు వేరు అంటూ ఆయన గట్టిగానే చెప్పేశారు. మొత్తానికి పవన్ కి చాలా విషయాలు గుర్తుకు తెస్తూ సీనియర్ నేత జనసేనకు గుడ్ బై కొట్టేశారు. మరి గాజు గ్లాస్ పార్టీకి గాజువాక ఎంతవరకూ గుర్తు ఉంది. ఎంత వరకూ బాధ్యత పడుతుంది అన్నది ఇక మీదట చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్.. ఆత్మ పరిశీలన
ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకత్వంపై నేతలకు, క్యాడర్ కు నమ్మకం ఉండాలి. ఒక్క అభిమానం ఉంటే సరిపోదు. వారితో తరచూ సమావేశమవ్వాలి. నాయకులకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అయినట్లే కన్పిస్తుంది. వరసగా ముఖ్యనేతలను పార్టీని వీడిపోతుండటం ఆయన నాయకత్వానికే పరీక్షగా మారనుంది. అసలు లోపం ఎక్కడుందన్నది పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.పవన్ కల్యాణ్ పెక్యులర్ పర్సనాలిటీ. తాను చదివిన పుస్తకాలు, ఉన్నంతలో తనకున్న రాజకీయ పరిజ్ఞానికే పవన్ కల్యాణ్ పరిమితమవుతారు. భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఏ నిర్ణయమైనా ఆయన స్వయంగా తీసుకుంటారు. పార్టీలో కీలక నేతలెవ్వరూ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు. పార్టీకి అంతా తానే అయి వ్యవహరిస్తారు. నిజమే కావచ్చు. పవన్ కల్యాణ్ ఇమేజ్ తోనే పార్టీ ఉందన్నది వాస్తవమే అయినా అదే సమయంలో నాయకులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది.జనసేన పార్టీ పెట్టి ఏడేళ్లు కావస్తుంది. పార్టీ పెట్టిన నాడు ఉన్న వారు ఇప్పుడు లేరు. నాదెండ్ల, కందుల దుర్గేష్ మినహా జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయితే ఆయన చెప్పిన కారణం సబబుగా లేకపోయినా పవన్ కల్యాణ్ వైఖరి నచ్చకనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వీడారు. జేడీ ఉంటే పార్టీకి కొంత ఇమేజ్, మైలేజీ ఉండేది.ఇటీవల పార్టీలో కీలక నేత మాదాసు గంగాధరం సయితం పార్టీని వీడివెళ్లిపోయారు. ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నేతే. వెళ్లిపోయిన నేత కు బలం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే పవన్ కల్యాణ్ ను నేతలు ఎందుకు వీడిపోతున్నారన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. పవన్ కల్యాణ్ ఎవరితో మాట్లాడరు. ఏ నిర్ణయం తీసుకున్నా నాదెండ్ల మనోహర్ తో తప్ప మరెవ్వరితోనూ చర్చించరు. బీజేపీతో దోస్తీ విషయంలోనూ అంతే. ఇలా తన వద్ద ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఉన్న నేతలూ మిగలరన్నది వాస్తవం