హైదరాబాద్, ఏప్రిల్ 27,
కరోనా బారిన పడి సామాన్యులతో పాటు... ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కరోనాతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆదివారం రోజున చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటలకు అయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారుకాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేసింది. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చైర్మన్గా, దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు.
ఎమ్మెస్సార్.. 1980-83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990-94 వరకు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు.2000-04 వరకు పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఎంఎస్ఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004-07 వరకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సవాల్ చేసి కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికకు కారణమయ్యారు.