వరంగల్
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్న ముఖ్య నేతలకు మంత్రులు శాలువా కప్పి, సన్మానించారు. నాటి పోరాటపటిమను గుర్తు చేశారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి, తెలంగాణ ఉద్యమానికి అడుగడుగున దిశానిర్దేశం చేస్తూ... ఉద్యమంలోనే ఊపిరి వదిలిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలువేసి జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ లక్ష్య సాధనలో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారమని మంత్రులు అన్నారు.