న్యూఢిల్లీ ఏప్రిల్ 27
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత, మందులు, వ్యాక్సిన్ల అంశాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపడుతున్న సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు డీల్ చేయాల్సిన కొన్ని జాతీయ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సంక్షోభం సమయంలో కోర్టు ఓ మౌన ప్రేక్షకుడిలా కూర్చోలేదు అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము హైకోర్టుల విచారణలకు అడ్డుపడటం లేదని, వాటికి సహాయక పాత్రను తాము పోషిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం తాము ప్రయత్నిస్తామని సుప్రీం తెలిపింది. గత వారం ఈ కేసును సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. కొవిడ్పై జాతీయ ప్రణాళికను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తమ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది. దానిని పరిశీలించిన తర్వాత శుక్రవారం మరోసారి దీనిపై విచారణ జరపనుంది.
మంగళవారం విచారణ సందర్భంగా రెండు అంశాలపై కేంద్రం నుంచి సుప్రీం ధర్మాసనం స్పష్టత కోరింది. కొవిడ్ సంక్షోభ నివారణలో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వనరులను వినియోగించడం, వ్యాక్సిన్ల ధరలపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం కేంద్రాన్ని అడిగింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలకు వ్యాక్సిన్లు ఇవ్వడమేంటని ఈ సందర్భంగా నిలదీసింది. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో దీనిపై కేంద్రానికే పూర్తి నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.