YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వామ్మో..ఢిల్లీ అంత్యక్రియలకు మూడు రోజులు

వామ్మో..ఢిల్లీ అంత్యక్రియలకు మూడు రోజులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27,
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతిచెందిన ఘటనలు పదుల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవించడంతో అంత్యక్రియల కోసం శ్మశనాల వద్ద మృతదేహాలతో బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో గతవారం రోజుల నుంచి రోజూవారీ మరణాలు 300 దాటుతున్నాయి. దీంతో అంత్యక్రియలు నిర్వహణకు శ్మశానాల్లో చోటు దొరకడంలేదు.ఢిల్లీలోని సరాయ్‌కాలే ఖాన్‌ శ్మశానవాటికలో రోజుకు గరిష్ఠంగా 22 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే సదుపాయం ఉంది. కానీ, అలాంటిచోటకు ఏకంగా 60-70 వరకు మృతదేహాలు వస్తున్నాయి. దీంతో.. వంద మృతదేహాలకు ఒకేసారి దహన సంస్కారాలు నిర్వహించేలా పక్కనే ఉన్న గ్రీన్‌ స్పేస్‌లో కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త నిర్మాణాల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అన్నారు. సోమవారం రాత్రికి 20 నిర్మాణాలు పూర్తికాగా.. మిగతా 80 పూర్తికావడానికి కొద్ది రోజులు పడుతుందని తెలిపారు.ఉత్తర ఢిల్లీ సీమాపురి శ్మశాన వాటికలోనూ ఇదే పరిస్థితి నెలకుంది. రోజుకు 80 వరకు మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకొస్తుండటంతో ఇక్కడి పార్కింగ్‌ స్థలంలో తాత్కాలిక సామూహిక దహనవాటిక నిర్మించాల్సి వచ్చింది. కరోనా విలయంతో ఢిల్లీలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో 25 శ్మశాన వాటికల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. శ్మశానవాటికల్లోని సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు. ఎంతలా అంటే, కట్టెలు తరలించడం సహా ఇతర ఏర్పాట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.అధికారిక లెక్కల ప్రకారం ఢిల్లీలో కొత్తగా 25 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో మరణాలు 350 దాటుతున్నాయి. గత వారం రోజుకు సగటున 304 మంది కోవిడ్‌కు బలయ్యారు. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. వందల కొద్దీ మృతదేహాలు వస్తుండటంతో అంత్యక్రియలకు చోటు దొరకడం లేదు. తాత్కాలిక ఏర్పాట్లు చేసినప్పటికీ.. రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది.

Related Posts