YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రి కోసం కసరత్తు షురూ...

రాజమండ్రి కోసం కసరత్తు షురూ...

రాజమండ్రి, ఏప్రిల్ 28, 
త్వరలో నగారా మ్రోగనున్న రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు టిడిపి ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేసింది. ఎపి అంతా జగన్ ఫోబియా లో ఉండటంతో ఎలాగైనా నాలుగోసారి రాజమండ్రి కార్పొరేషన్ గెలిచి తమ సత్తా చాటాలని సైకిల్ పార్టీ తహతహ. మూడు సార్లు రాజమండ్రి కార్పొరేషన్ ను వరుసగా గెలిచిన టిడిపి గత ఫార్ములా తో ముందుకు వెళుతుందా లేక కొత్త వ్యూహంతో బరిలోకి దిగనుందా అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఈ మూడు సార్లు ఎన్నికలకు ప్రస్తుత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారథ్యంలోనే నడిచాయి. ఆయన టిక్ పెట్టిన వారికే టిక్కెట్లు దక్కాయి. మేయర్ అభ్యర్థులను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆయన మార్క్ లేకుండా ఎన్నికలకు టిడిపి బరిలోకి దిగనుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అర్బన్ నుంచి రూరల్ కి గోరంట్ల మారడంతో ఆయనకు సహజంగానే నగరంలో పట్టు సడలింది. అయినప్పటికీ రూరల్ లో కొన్ని డివిజన్లు కార్పొరేషన్ లో ఉన్నప్పటికి గతంలోని ఆధిపత్యం రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఉండదు.ప్రస్తుత ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబమే అన్ని తామే అయ్యి కార్పొరేషన్ ఎన్నికలకు నడుం బిగిస్తుంది. జగన్ సునామీ లో భారీ మెజారిటీ తో టిడిపి నుంచి భవాని గెలిచారు. దాంతో అధిష్టానం సైతం ఆదిరెడ్డి కుటుంబాన్ని కాదని నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేయదు. ఈ నేపథ్యంలో అన్ని బలగాలతో సిద్ధం అవుతూ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న అధికారపార్టీని ఢీకొనడం చిన్న విషయం కాదు. అయితే టిడిపి లో రోజు రోజు సీనియర్లు ఫ్యాన్ కిందకు చేరి గాలి పీలుస్తున్నారు. సైకిల్ కి తరచూ రాజమండ్రిలో పంచర్లు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టిడిపికి అభ్యర్థులే లేకుండా చేయాలన్న ఎత్తుగడతో ఎంపి భరత్ రామ్ టీం గట్టిగా దృష్టి పెట్టింది. ఇదే ఇప్పుడు ఆదిరెడ్డి టీం ను కలవరపెడుతుంది.గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఆయన కార్పొరేషన్ ఎన్నికలకు అనుసరించిన మార్గాలని ఆదిరెడ్డి అనుసరిస్తారా లేదా అన్నది చూడాలి. రాజమండ్రి మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అవతరించిన తొలి ఎన్నికల్లో విశాఖ నుంచి దిగుమతి చేసుకున్న ఎం ఎస్ చక్రవర్తిని మేయర్ గా ప్రకటించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి . నాటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన వ్యూహం పనికొచ్చింది. టిడిపి విజయం సాధించింది. రెండోసారి ఆదిరెడ్డి అప్పారావు సతీమణికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ కి టిక్ పెట్టారు. పార్టీలో ఉన్నవారికి కాకుండా భర్త పార్టీలో ఉంటె భార్యకు ఎలా ఇచ్చేశారన్న విమర్శలు బుచ్చయ్య ఎదుర్కొన్నా నాటి వ్యూహం కూడా ఫలించింది. ఇక ముచ్చటగా మూడోసారి గోరంట్ల కాంగ్రెస్ నేత గా ఉన్న పంతం కొండలరావు భార్య పంతం రజని ని పార్టీలో చేర్చుకుని మేయర్ గా ప్రకటించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాడు కూడా తీవ్ర విమర్శలనే ఆయన ఎదుర్కొన్నా అప్పటి వ్యూహం కూడా సక్సెస్ అయ్యి హ్యాట్రిక్ విజయాలు పార్టీ ఖాతాలో జమచేశారు గోరంట్ల. ఇలా త్రి టైమ్స్ కూడా పార్టీ జండా నేరుగా మోసిన వారికి కాకుండా కొత్త వారిని తెచ్చే గెలుపు తీరానికి చేర్చారు ఆయన. ఈసారి సరికొత్త వ్యూహంతోనే టిడిపి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది అంటున్నారు ఆ పార్టీ వర్గాలు.
రెండు వర్గాలుగా టీడీపీ
రాజకీయ చైతన్య కెరటం రాజమహేంద్రిలో కరోనా విజృంభణకు మించి నేతలు విజృంభిస్తున్నారు. అతి త్వరలో కార్పొరేషన్ ఎన్నికలకు గంట కొట్టేస్తారన్న టెన్షన్ తో అధికార వైసిపి ప్రధాన ప్రతిపక్షం టిడిపి కత్తులు ఎడా పెడా నూరేస్తున్నాయి. నిత్యం మీడియా సమావేశాలు, సభలు, కార్యక్రమాలు జోరుగా నడుస్తున్నాయి. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల అంశంపై ఇరు పక్షాలు గట్టిగా దృష్టి సారించాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నిండిపోవడంతో నేతలు వారిలో ధైర్యాన్ని ఉత్సహాన్ని నింపేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు.టిడిపి నేతలు ఎంత ధైర్యం నూరిపోస్తున్నా మీకు అండగా దండగా ఉంటామని భరోసా ఇస్తున్నా బలమైన నేతలు అధికార వైసిపి లోకి దూకేస్తున్నారు. వీరిలో చాలామంది మాజీ కార్పొరేటర్లు కావడం గమనార్హం. అయితే కొత్తగా వైసిపి లోకి వస్తున్న వారితో అధికారపార్టీ కళకళలాడుతున్న వివిధ డివిజన్ల పై ఆశలు పెంచుకున్న ఫ్యాన్ పార్టీ కి చెందిన కొందరిలో ఆందోళన మొదలైంది. కొత్తగా వచ్చినవారికి టిక్కెట్ హామీ లభిస్తే తమ గతేమి అవుతుందన్న బెంగ వారిలో మొదలైంది. సీనియర్ నేతలు ఫ్యాన్ కింద సేద తీరడాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు సైకిల్ దిగిపోవడానికి రెడీ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రకటన వచ్చాకా కొందరు దానికి ముందు మరికొందరు వచ్చేలా అధికారపార్టీ ప్లాన్ చేసినట్లు ప్రచారం నడుస్తుంది.టిడిపి వర్గాల్లో మరో బెంగ ఉంది. పసుపు పార్టీలో సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల నడుమ సమన్వయం సాధ్యం అయితేనే అధికారపార్టీకి ఎదురొడ్డి పోరాడగలమని కానీ ప్రస్తుతం ఆ సీన్ కనుచూపు మేరలో కనిపించడం లేదని ఆ పార్టీలో వారే భావిస్తున్నారు. దాంతో రాజమండ్రి కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని హ్యాట్రిక్ గా గెలుచుకువచ్చిన తెలుగుదేశం నాలుగోసారి తామే గెలుస్తామన్న ధీమా పైకి వ్యక్తం చేస్తున్నా లోలోపల అనుమానాలు వ్యక్తం చేస్తుందంటున్నారు.ఇక అధికారపార్టీ లో గ్రూప్ లు ప్రస్తుతం సైలెంట్ అయినా కార్పొరేషన్ ఎన్నికల టిక్కెట్ల సమయంలో బయటపడే అవకాశాలు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నాయి. జగన్ హవా తో ఈసారి టిక్కెట్ దక్కించుకుంటే చాలు విజయం అదే దక్కుతుందన్న నమ్మకంతో అధికారపార్టీలో ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురు నలుగురు సీట్లు ఆశించే వారు సిద్ధం అయిపోయారు. వీరికి తోడు టిడిపి నుంచి వచ్చే వారికి బెర్త్ లు కేటాయించాల్సి ఉంటుంది. దాంతో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఉత్కంఠ రెక్కేత్తించే అంశమే. రాజమండ్రి కార్పొరేషన్ లో విజయం సాధించి తీరాలని ఇప్పటికే అధినేత జగన్ నేతలందరికి లక్ష్య నిర్దేశ్యం చేశారు. అంతే కాదు ఏ మాత్రం తేడా కొట్టినా నేతల ప్రయార్టీలు ఉల్టా పల్టా అవుతాయని సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రాజకీయాలు ఎండలను మించి మండిపోతున్నాయి

Related Posts