ముంబై ఏప్రిల్ 28
మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఐడీసీ)లోని ఎంఆర్ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 45 నిమిషాలపాటు కష్టపడి మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎనిమిది మంది శ్రామికులు ఉన్నారని, వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.