న్యూఢిల్లీ ఏప్రిల్ 29
దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వివిధ రంగాల వారితో కరోనా పరిస్థతిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వైద్యరంగ ప్రముఖలతోపాటు, ఫార్మా పరిశ్రమ నిపుణులతో చర్చించిన ఆయన, ఇటీవల సీడీఎస్ బిపిన్ రావత్, ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బౌదరియాతో కూడా కరోనా కట్టడిపై చర్చించారు. తాజాగా ఈ మధ్యాహ్నం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానెతో కూడా ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆర్మీ ఇప్పటికే పోషిస్తున్న, ఇకపై పోషించాల్సిన పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించారు. కరోనా సోకిన సాధారణ పౌరులకు చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రులను తెరువాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వివరాలను ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం మీడియాకు వెల్లడించింది.