మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ ముందస్తు విడుదల కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ కె.కె శశిధరన్, జస్టిస్ ఆర్.సుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్ను తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు ఆధీనంలో ఉన్నందున తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె దాదాపుగా 25ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. 20ఏళ్లకు పైగా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఓ పథకాన్ని రూపొందించింది. దీంతో తన ముందస్తు విడుదల కోరుతూ నళిని పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెను విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ కేంద్రం దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు నిర్ణయంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినితో పాటు మురుగన్, పెరారివాలన్, శాంతన్ సహా ఏడుగురు వెల్లూర్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.