తీవ్ర నగదు కొరత పరిస్థితులతో అభివృద్ధిపై, సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదుకు తీవ్ర కటకటలు నెలకొన్న విషయం తెలిసిందే. నగదు కొరతకు కారణాలను గుర్తించడంతోపాటు దీని పరిష్కారానికి ఓ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.‘‘స్థూల స్థాయిలో బ్యాంకులు నగదు నిర్వహణలో విఫలమైతే ఇక సూక్ష్మ స్థాయిలో అవి ఏం చేయలేవు. బ్యాంకులు భౌతికంగా ప్రజల్లో భయానక పరిస్థితిని కల్పిస్తున్నాయి. వృద్ది రేటుపై, సమాజంపై కరెన్సీ కొరత ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’’ అని చంద్రబాబు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. బ్యాంకు సేవలు మెరుగుపడకపోతే డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకురాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు రూపంలో చెల్లింపులు చేసేందుకు బ్యాంకులు సహకారం అందించాలని కోరారు.