హైదరాబాద్
కరోనా సమయంలో ఏ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని స్పందించకున్నా ఈటెల రాజేందర్ పని చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించారని.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో విచారణ చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణకు ఆదేశించలేదని కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల మాత్రమే కాదు..అన్ని పార్టీల నేతలు భూకబ్జాలపై విచారణ జరపాలన్నారు. మంత్రి మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై భూకబ్జా ఆరోపణలను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. కీసర దళితుల భూములు, గాంధీ ట్రస్ట్, వక్ఫ్ భూములపై ఎందుకు స్పందించలేదన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈటెల పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.లాక్డౌన్లో కిరాయిలు అడగొద్దన్న వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రభుత్వంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.