ఈటెలకు కేసీఆర్ షాక్
ఉదయం నుంచి కొనసాగిన సోదాలు
సీఎంఓకు ఆరోగ్యశాఖ మార్పు
హైదరాబాద్, మెదక్, మే 1,
మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూముల కబ్జా చేసిన మాట వాస్తవమే అన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. భూముల కబ్జాపై నాలుగు గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఉదయం నుంచి విచారణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అసైన్డ్ భూముల్ని లాక్కోవడం చట్టరిత్యా నేరమన్నారు కలెక్టర్ హరీశ్. మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్లో డిజిటల్ సర్వే కొనసాగుతోంది. దీంతో పాటు హేచరీస్కు పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తున్నారు. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసైన్డ్దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు.మంత్రి ఈటల రాజేందర్ తమ అసైన్డ్ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన పలువురు రైతులు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతుల ఫిర్యాదుపై స్పందించిన సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు.
అపలేం జరిగిందంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై బాధిత వ్యక్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్ దీనిపై సమగ్ర విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధిత రైతులు మంత్రి ఈటలపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ సారాంశం ఇదే..‘‘మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ తండ్రి పెద్ద వెంకటయ్య, చాకలి కృష్ణ బిచ్చవ్వ, చాకలి నాగులు, చాకలి పరుశురాం తండ్రి నాగులు, ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే తాము సవినయముగా విన్నవించునది ఏమనగా, ప్రభుత్వం వారు 1994 సంవత్సరంలో మాకు అనగా.. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ తండ్రి పెద్ద వెంకటయ్య, చాకలి కృష్ణ సనాఫ్ బిచ్చవ్వ, చాకలి నాగులు, చాకలి పరుశురాం తండ్రి నాగులు కుటుంబాలకు సర్వే నంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికి ఒక ఎకరం 20 గుంటల చొప్పున, ఎరుకల దుర్గయ్యకు సర్వే నంబర్ 64/6 లో 3 ఎకరాలు, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములుకు కొంత భూమిని అసైన్డ్ భూముల కింద కేటాయించడం జరిగింది.కొన్ని నెలలుగా రాష్ర్ట మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరులు సూరి @ అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్ రెడ్డిలు మా గ్రామాల భూములను స్వాధీనపరుచుకొన్నారు. ఒక పథకం ప్రకారం వాటి కబ్జా ప్రక్రియకు తెరలేపినారు. ఆ పథకంలో భాగంగా వారు మమ్మల్ని, మీ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుంటుంది అని భయభ్రాంతులకు గురి చేసి మాతో పాటు దాదాపు 100 మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతుల యొక్క భూ కేటాయింపు సర్టిఫికేట్ లను దౌర్జన్యముగా వారు మా వద్ద నుంచి స్వాధీనపరుచుకున్నారు.వారి భూ దాహానికి మా ఇరు గ్రామాల పరిధిలోని సుమారు 100 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురి అయ్యాయి. అట్టి భూముల్లో వారు నిబంధనలకు విరుద్ధంగా ఒక పెద్ద పౌల్ర్టీ పరిశ్రమ స్థాపనకు ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా షెడ్ల నిర్మాణం యధేచ్చగా కొనసాగిస్తున్నారు. అక్రమంగా భూములను కబ్జా చేయడమే కాక, వారి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కొంతమంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులను వారి చుట్టుపక్కల ఉన్న భూములను కూడా కబ్జా చేసి వారికి దారికి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు.ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు కూడా నీ భూమి అమ్ముకో.. లేదంటే నీ భూమికి శాశ్వతంగా దారి లేకుండా చేస్తామని బెదిరిస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని అట్టి వారిపై జులుం చేస్తున్నారు. అయ్యా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాలాంటి నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులకు సరైన న్యాయం తమరి ఒక్కరి వల్లే జరుగుతుంది. కావున మా ప్రార్థన మన్నించి తమరు తక్షణమే మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరుల యొక్క కబంద హస్తాలలో కబ్జాకు గురైన మా అసైన్డ్ భూములను వారి చెర నుంచి విడిపించి మాకు అట్టి భూములపై హక్కులు కల్పించగలరని మిమ్మల్ని సవినయముగా వేడుకుంటున్నాం.’’ బాధిత రైతులు ఈటల రాజేందర్పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అచ్చిరాని ఆరోగ్యశాఖ తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్కు గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈటల శాఖను తనకు కేటాయించాలని సీఎం గవర్నర్ను కోరారు. దీంతో మంత్రి ఈటల శాఖను కేసీఆర్కు బదిలీ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు . ఇప్పుడు కేసీఆర్ పరిధిలోకి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా మిగిలారు.గతంలో కూడా వైద్యఆరోగ్య శాఖ మంత్రిని కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పించారు. హెల్త్ మినిస్టర్గా పనిచేసిన తాటికొండ రాజయ్యపై కూడా గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను కూడా కేబినెట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మంత్రి ఈటల రాజేందర్పై కూడా భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రి శాఖను కూడా తొలగించారు.మరోవైపు మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించారు. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. భూముల్లో డిజిటల్ సర్వే కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాత సీఎస్కు నివేదిక అందజేస్తామని కలెక్టర్ బురద చల్లే కార్యక్రమం మానండి : ఈటల మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి పొమ్మంటే సంతోషంగా వెళ్లిపోతానని.. లేదంటే వదిలి పెట్టమని చెప్తే పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోతానని.. అన్నారు. కానీ ఇలాంటి ఆరోపణలు తనపై వేసి తనను అవమానించే రీతిలో వ్యవహరించడం మంచి పద్ధతి కాదున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను నికార్సయిన మనిషనని చెప్పుకొచ్చారు. గులాబీ జెండా అందరిదీ అని ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. మంత్రి ఈటల భూములు ఆక్రమించారని ఆరోపణల పై నిన్నటి నుంచి మీడియాలో కథనాలు వస్తున్నాయి . దీనిపై ప్రభుత్వం రెవెన్యూ, విజిలెన్సు శాఖకు ఎంక్వయిరీ కి ఆదేశించింది. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.నాపై ఆరోపణలు వస్తే.. సీఎం కు సీఎస్ కు కాగితాలు వస్తే నాకో మాట చెప్పాల్సి ఉండాలన్నారు. టీవీలు కూడా వివరణ కోరాల్సి ఉండాల్సిందన్నారు. ఏలాంటి విచారణ లేకుండా..సంజాయిషి లు తీసుకోకుండా వార్తలు వేయడం బాధాకరమన్నారు. కేసీఆర్ తో గ్యాప్ గురించి తెలియదన్నారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్దమని సవాల్ చేశారు ఈటల. సీఎం కేసీఆర్,కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానని, పర్సనల్ మొబైల్ కు ఫోన్ చేసినా స్పందించలేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.టిఆర్ఎస్ టివి ఛానళ్లు, న్యూస్ పేపర్లలో బురద జల్లే వార్తలు రావడం బాధాకరమన్నారు. ఈ వార్తలను సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నా, కుటుంబమే కోల్ల ఫారంలు నడుపుతోందన్నారు. కాంట్రాక్టులు, దొంగపనులు ఏనాడు చేయలేదన్నారు. ఇంతకు మించి ఎదగాలని ఎప్పుడు ఆశ పడలేదన్నారు. తనకు కుట్రలు , కుతంత్రాలు తెలియవన్నారు. అయినా తను బెదిరేది లేదని, విచారణ కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత భవిష్యత్తుపై ఆలోచన చేస్తానని రాజేందర్ తెలిపారు. వైద్యారోగ్య శాఖను తన నుంచి తప్పించి ముఖ్యమంత్రికి బదిలీ చేయడంపై ఈటల రాజేందర్ స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన నుంచి ఆ శాఖను తొలగించినందుకు సీఎం కేసీఆర్కు ఈటల ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశంతో వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసుకున్నారని మంత్రి ఈటల చెప్పారు. తన వద్ద ఏ శాఖ లేకపోయినా కానీ, ప్రజలకు సేవ చేస్తానని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందని రాజేందర్ వెల్లడించారు.ప్రణాళిక ప్రకారమే తనకు ఉద్వాసన పలికేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వారు అంతకు అంతా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్తో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేయబోనని స్పష్టం చేశారు. త్వరలోనే తన అనుచరులు, నియోజకవర్గ ప్రజలతో సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈటల మీడియాతో అన్నారు.ప్రస్తుతం ఈటల రాజేందర్ వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్కు బదలాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ప్రతిపాదన మేరకు ఈ మార్పు జరిగినట్లు గవర్నర్ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామంపైనే తాజాగా ఈటల స్పందించారు. ఈటల రాజేందర్కు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆయన ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ కలిసి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరోనాతో రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్లో పండుకున్నారంటూ విమర్శిస్తున్నారు. కేసీఆర్ కేబినెట్లో నిజాయతీగా పని చేసే వ్యక్తి ఈటల మాత్రమేనని కొనియాడారు.షామీర్పేట్ చౌరస్తాలో ఈటల అభిమానులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నేతను అక్రమంగా ఇరికిస్తున్నారని వారు ఆవేదన చెందారు.
మంత్రిని బుక్ చేసిన మాజీ అధికారి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్న వేళ స్థానికంగా పని చేసిన అప్పటి ఉన్నతాధికారులు స్పందించారు. అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందిస్తూ... అప్పట్లో మంత్రి తనను అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారని చెప్పి సంచలనం సృష్టించారు. అచ్చంపేట వద్ద మంత్రికి కోళ్ల ఫారాలు ఉన్నాయనీ, వాటి కోసమే భూమిని రెగ్యులరైజ్ చేయాలని కోరారని ధర్మారెడ్డి వెల్లడించారు. అయితే, కలెక్టర్ స్థాయిలో అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం అయ్యే పని కాదని తాను చెప్పానని ఆయన తెలిపారు.మరో అధికారి అయిన అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ అక్కడ 25 ఎకరాల భూమిని ఇవ్వాలని తనను మంత్రి ఈటల రాజేందర్ సంప్రదించినట్లు చెప్పారు. తాను వెళ్లి ఆభూములను పరిశీలించానని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అసైన్డ్ భూములు ఇవ్వడం కుదరదని తాను చెప్పానని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం ఈ భూమి ఈటల ఆధీనంలోనే ఉందని ఆయన వివరించారు.మంత్రి ఈటల భూ కబ్జాలకు పాల్పడినట్లు పలువురు రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు. అచ్చంపేట, హకీంపేట ప్రాంతంలో సుమారు 100 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేశారని తెలిపారు. మంత్రి అనుచరుల రాత్రికి రాత్రి తమ స్థలంలో నుంచి రోడ్డు వేశారని రైతులు ఆందోళన చేశారు. ఈటల రాజేందర్ పేరుతో వచ్చిన వారు ఈ రోడ్డు వేశారని, తమకు చెందిన తాత ముత్తాతల నుంచి సేద్యం చేసుకుంటూ వస్తున్న భూమిని వారు ఇలా కబ్జా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ దిష్టిబోమ్మ దగ్ధం మంత్రి ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం... వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో మంత్రి ఈటల అభిమానులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై మండి పడుతున్నారు. సంతోష్ కుమార్ సిఎం కెసిఆర్కు తోడల్లుడి కుమారుడు. అయితే మంత్రి ఈటలను కేబినెట్ నుంచి సాగనంపే కుట్రలో సంతోష్ కుమార్ కు ప్రధాన భాగస్వామ్యం ఉందని ఈటల అభిమానులు మండిపడుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల ఎంపీ సంతోష్ కుమార్కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎంపీ సంతోష్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఏడాది కాలంగా ఈటలను సాగనంపేందుకు సంతోష్ కుట్రలు పన్నుతున్నారని అభిమానులు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో స్కూటర్ పై వచ్చే కొందరు నాయకులు ఇవాళ వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే.