న్యూఢిల్లీ మే 6
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. ఇప్పటి వరకు 17.15 కోట్లకుపైగా వ్యాక్సిన్లను ఉచితంగా అందజేసిందని, ఉదయం 8 గంటల వరకు అందించిన సమాచారం మేరకు వృథాతో సహా మొత్తం 16,26,10,905 మోతాదులు వినియోగించినట్లు చెప్పింది. 89,31,505 డోసులు ఇప్పటికీ యూటీలు, రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ‘నెగెటివ్ బ్యాలెన్స్ ఉన్న రాష్ట్రాలు సాయుధ దళాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్ను సర్దుబాటు చేయనందున సరఫరా చేసిన వ్యాక్సిన్ కంటే ఎక్కువ వినియోగాన్ని (వ్యర్థాలతో సహా) చూపుతున్నాయి’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.రాబోయే మూడు వారాల్లో 28,90,360 డోసులు సరఫరా చేయనున్నట్లు చెప్పింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రాష్ట్రాలు, యూటీల సహకారంతో ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ అనేది మహమ్మారి నియంత్రణ కేంద్రం ఐదు పాయింట్ల వ్యూహంలో అంతర్భాగమని పేర్కొంది. కొవిడ్ టీకా ‘లిబరలైజ్డ్ అండ్ యాక్సిలరేటెడ్ ఫేజ్-3 స్ట్రాటజీ’ అమలు మే 1 నుంచి ప్రారంభమైందని, లబ్ధిదారులు నేరుగా కొవిన్ పోర్టల్ (http://cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది.