న్యూఢిల్లీ మే 6 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కొవిడ్-19 వ్యాక్సిన్ల ధరల తగ్గింపుపై కేంద్రం మౌనం, వ్యాక్సినేషన్ను రాష్ట్రాలకు వదిలేయడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యాక్సిన్ల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కిందకు తీసుకువస్తే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల ధరలను నియంత్రించవచ్చన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి టీకాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసన్ కింద డ్రగ్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ సైతం ఉందని, ప్రభుత్వం వ్యాక్సిన్లను డ్రగ్ ప్రైస్ కంట్రోల్ కిందకు తీసుకువస్తే, వాటి ధరలను నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఆర్టికల్ 370 కోసం ఆర్డినెన్స్ తీసుకురాగలదని.. వ్యాక్సిన్ల కోసం కాదు’ అని విమర్శించారు.