న్యూఢిల్లీ మే 6
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ గత ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. చాలాచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.కాగా, ఈ ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తృణమూల్ గూండాలే తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జి విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని కోరింది.