కరీంనగర్, మే 7,
మొసలి నీటిలో ఉంటేనే దానికి బలం.. బయటకు వచ్చిందంటే చచ్చినట్టే..ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. రాజకీయనాయకులకూ అంతే... పార్టీ అండదండలుంటే బలం ఎంతైనా ఉంటుంది. అదే పార్టీల్లోంచి బయటకొచ్చేస్తే బలం ఒక్కసారిగా తగ్గిపోతుంది. కానీ తగ్గిపోయే ముందు ఆ బలాన్ని రెట్టింపు చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ వేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్... పార్టీతో ఎక్కడ చెడిందో ఎలా చెడిందో కానీ ఈటలను కేబినెట్ నుంచి తప్పించడం.. ఆ తర్వాత బర్తరఫ్ చేయడం వరకు చకచకా సాగిపోయాయ్. కేసీఆర్ ఇష్టం లేకుంటే అసలు ఏ విషయంలోనూ వెనక్కితగ్గరు. పార్టీకి తనకు డామేజ్ కానంత వరకు ఓకే.. అంతకు మించి ఒక్క ఇంచ్ తేడా వచ్చినా ఆయన రూటే సెపరేట్ అవుతుంది. ఐతే... ఈటల రాజేందర్ విషయంలో భూకబ్జా ఆరోపణలతో ఒక్కసారిగా దూకుడు పెంచిన హైకమాండ్ పార్టీలోంచి తొలగించాలన్న విషయంలో మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఈటలపై ఇప్పటికే జనంలో సానుభూతి వస్తోంది. కరోనా సమయంలో సమర్థవంతంగా శాఖను నిర్వహించారని... రివ్యూల ద్వారా..తన మాటలతో జనాలకు భరోసా కల్పించారన్న ఫీలింగ్ ఉంది. పార్టీకి..తనకు గ్యాప్ ఉందని విషయం అధిష్టానం కంటే ఈటలకే చాలా బాగా తెలుసు. అందుకే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన సఫలమయ్యారు. కరోనాపై అప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించేలా మాట్లాడి భరోసా కల్పించారు. దీంతో ప్రజల్లో నిత్యం నానుతూ ఉన్న వ్యక్తిపై వేటు వేస్తే అది పార్టీకి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం పడింది. ఇప్పటికే ఈటల విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నప్పటికీ.. దూకుడుగా వెళ్తే అది ఓవరాల్ గా పార్టీకి నష్టమని... అందుకే వేచి చూసే ధోరణి అవలంబించాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటి వరకు పార్టీపైనా, అధినేతపైనా ఆచితూచి మాట్లాడుతున్న ఈటల ఇకపై దూకుడు పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం ఇంతలా కష్టపడితే... తనను పరాయివాడిలా బలిపశువు చేశారని ఈటల భావిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా ఇరుకునపెట్టేలా అడుగులు వేయాలని ఈటల తలపోస్తున్నారు. వాస్తవానికి కేబినెట్ నుంచి తప్పించినప్పుడు, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని భావించినా ఆయన మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఉన్నారు. అందుకు టీఆర్ఎస్ పార్టీకి వీలైనంత సమయమిస్తే... వారు మరిన్ని తప్పులు చేస్తారని మొత్తంగా ఆ పరిణామాలన్నీ తనకు లాభిస్తాయని ఈటల భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫ్రష్ గా ఎన్నికలకు వెళ్లాలని భావించిన ఈటల... టీఆర్ఎస్ కార్యాచరణకు అనుగుణంగా అడుగులు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో సుధీర్ఘంగా చర్చించిన ఈటలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి తక్షణం రాజీనామా చేయాలని కొందరు సూచించగా... మరికొందరు వేచి చూడాలంటూ సలహా ఇచ్చారట. రాజీనామా చేయడం పక్కా అయినా..అంతకు ముందు పార్టీ తీసుకునే నిర్ణయాల ద్వారా జనంలో సింపతీ పొందాలని ఈటల భావిస్తున్నారట. అందుకే టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూసి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే బెటరన్న ఆలోచనలో ఈటల ఉన్నారట. అల్టిమేట్ గా హూజూరాబాద్ ఉపఎన్నిక రావడం ఖాయమని..అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించి... సత్తా చాటుకోవాలన్నది కూడా ఈటల ప్లాన్ గా ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. బలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఢీకొట్టడం కంటే బలహీనంగా ఉన్నప్పుడు కొడితే అది వ్యక్తగతంగా తనకు, రాజకీయంగా కేసీఆర్కు గడ్డు పరిస్థితులకు కారణం అవుతుందని ఈటల వ్యూహరచన చేస్తున్నారట.